మంచి మాట
పసిప్రాయం ఒక తెల్ల కాగితం లాంటిది. వారు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ, అనుకరిస్తూ ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. వారి చిన్ని చిన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పసిపిల్లలకు ‘నేను, నాది’ అనే అహంకారం ఉండదు. వారు తమను తాము ప్రత్యేకంగా చూసుకోరు. ప్రకృతిలో, అందరిలో కలిసిపోతారు. ఈ నిర్మలత్వమే వారిని దైవస్వరూపులుగా చేస్తుంది.
గత జ్ఞాపకాల్లో లేదా భవిష్యత్తు ఆందోళనల్లో కాకుండా, ప్రస్తుత క్షణంలో ఉండటం పసిపిల్లల లక్షణం. వారు గడిచిన నిమిషం గురించి బాధపడరు, రేపటి గురించి భయం చెందరు. ఈ ‘స్థితప్రజ్ఞత’ వారికి దైవికమైన ఆనందాన్ని ఇస్తుంది. కోపాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండటం. రేపటి చింత లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదించడం. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం పిల్లల మనస్తత్వం.
ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మలక్షణం ’సత్–చిత్–ఆనందం’. పిల్లల ప్రతి చర్యలోనూ ఒక చైతన్యం, ఒక సహజ సిద్ధమైన ఆనందం కనిపిస్తుంది. వారిని చూసినప్పుడు మనసు ప్రశాంతంగా మారడానికి కారణం వారిలో ప్రతిబింబించే ఆ పరమాత్మ తత్వమే. పిల్లల ప్రేమలో ఎటువంటి ఆశలు, నిబంధనలు ఉండవు. వారు కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. భగవంతుడు కూడా అటువంటి నిష్కల్మషమైన ప్రేమకే లొంగుతాడని మన పురాణాలు చెబుతున్నాయి.
మనం మనలోని బాల్యాన్ని మర్చిపోవడం వల్లే ఒత్తిడికి, అసూయకు లోనవుతున్నాం. ఆధ్యాత్మిక సాధన అంటే కొత్తగా ఏదో సంపాదించడం కాదు, మళ్ళీ పసిపిల్లవాడిలా నిర్మలమైన మనసును పొందడమేనని పెద్దలు చెబుతుంటారు. మనలోని ఆ ‘బాల్యాన్ని’ మేల్కొల్పడమే నిజమైన ఆత్మసాక్షాత్కారం. అందుకే ఆధ్యాత్మికవేత్తలు‘ మళ్ళీ ఒక బిడ్డలా మారిపొమ్మని చెబుతుంటారు.
మనిషి ఎదుగుతున్న కొద్దీ అనుభవాలు, పంతాలు, పట్టింపులు, సమాజం నేర్పిన ముసుగులు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి. ఆత్మసాక్షాత్కారం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మనపై పేరుకున్న ఈ కృత్రిమ పొరలను తొలగించుకుని, మన లోపల అంతర్లీనంగా ఉన్న ఆ పసిబిడ్డ వంటి స్వచ్ఛతను తిరిగి దర్శించడమే.
పిల్లలు దేవుడిచ్చిన వరాలు. పిల్లల కళ్ళలో కనిపించే మెరుపు కోటి వెలుగులతో సమానం. వారికి ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. ఒక చిన్న రంగుల బంతి లేదా వాన చినుకు వారిని పరవశానికి గురిచేస్తుంది. వారి ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక వింతే, ప్రతిరోజూ ఒక పండుగే. ఒక ఖాళీ అట్టపెట్టె వారికి విమానం కావచ్చు, ఒక చిన్న కర్ర గుర్రం కావచ్చు. పిల్లలు తమ ఊహలతో ఒక మాయా లోకాన్ని సృష్టించుకుంటారు. అక్కడ బొమ్మలు మాట్లాడతాయి, చెట్లు కథలు చెబుతాయి. పిల్లలకు కులమతాలు, పేద– ధనిక భేదాలు తెలియవు. తోటిచిన్నారి నవ్వితే వీరు నవ్వుతారు, ఏడిస్తే పలకరిస్తారు. క్షణంలో గొడవపడినా, మరుక్షణమే మర్చిపోయి మళ్ళీ ఆడుకునే గుణం కేవలం వారి పసిడి మనసులకే సొంతం. వారి పసిడి ప్రపంచాన్ని ప్రేమతో, భద్రతతో కాపాడుకోవడం మన అందరి బాధ్యత. వారి చిరునవ్వు ఇంట్లో ఉంటే, ఆ ఇల్లే ఒక నందనవనం.
– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి


