దక్షిణ కైలాసం: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం
మహేశ్వరా! మహాశివా పరమ శివా అని ఈశ్వరుని ఆరాధిస్తాం. అంటే మహాపర్వతం మీద వాసం ఉండేవాడు అని అర్ధం. అంతటి మహాశివుడికి పెద్ద మహా శివాలయాన్ని కేరళలో నిర్మించారు. నిరూపధారిగా లింగ రూపంలో మహా మహా రుద్రాలను తనలో ఆవహించుకున్న మహాదేవుడు లోక రక్షకుడు పరమ శివుడు. మన పుణ్యభూమిలో పలుచోట్ల జ్యోతిర్లింగాలు... ఆత్మలింగాలుగా కొలువుదీరాడాయన. అలాంటి మహాలింగం కేరళలో నిర్మించారు.
కేరళ రాజధాని తిరువనంతపురానికి దగ్గర నెయ్యాటింకర అనేప్రాంతంలో ఉంది. నూట పదకొండు అడుగుల ఎత్తు గల శివలింగాన్ని ప్రతిష్టించారు.అక్కడ ఎనిమిది అంతస్థులలో మన దేశంలోకెల్ల పెద్ద శివ క్షేత్రం. దీని పేరు చెంగల్ శివ పార్వతి క్షేత్రం. ఈ స్థల మహాత్మ్యం చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ రెండు సార్లు అతి రుద్ర యజ్ఞం చేశారు. అలాగే మరెన్నో సార్లు అతిరుద్ర యజ్ఞం చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఒకసారి అతి రుద్ర మహా యజ్ఞం చేయడమే గొప్ప విషయం. చెంగల్ శివ పార్వతి క్షేత్రం ఉన్న ప్రదేశం ఎంతో పుణ్యభూమిగా భావిస్తారు.
ఈ స్థలానికి ఉండే మహత్వాన్ని గమనించి స్వామి మహేశ్వరానంద సరస్వతి ఈ మహా శివలింగ ప్రతిష్ట కోసం పూనుకున్నారు. వీరికి కంచికామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి మంత్ర దీక్ష ఉపదేశించారు. ఈ పుణ్యస్థలం పేరు పుట్టురాకల్. ఇక్కడే శివపార్వతులు పుట్టరూపంలో వెలిశారు. ఇక్కడ జరిపిన తవ్వకాలలో దొరికిన ఆధారాల వలన దేవాలమం 5 వేల ఏళ్ళ పురాతనమైనది అని తెలిసింది. దేశం నలుమూలల నుంచి మట్టి, పవిత్ర నదీ జలాలు వనమూలికలు తెచ్చి నిర్మించారు. మూలాధారంగా వినాయకుడు సరస్వతి బ్రహ్మ రూపాలను ప్రతిష్టించారు. మొదటి అంతస్థు భూ మట్టానికి కింద నిర్మించారు.
64 మహారూపాలలో శివుని విగ్రహాలను ఉంచారు. భక్తులు కూర్చుని ధ్యానం చేయడానికి వీలు కల్పించారు అలాగే ప్రతి అంతస్థులో ఓంకారనాదం వినిపిస్తుంటుంది. పంచభూతాలు తనలో ఇమిడి ఉన్నట్టుగా ప్రకృతి అందాలను చిత్రీకరించారు. ఏడవ అంతస్తులోకి వెళితే కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది మనకి. సహస్రదళ పద్మాకృతి కింద శివ పార్వతి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలోకి వెళ్లడం మనస్సుకి ప్రశాంతంగా ఉండడం గమనించవచ్చు. కింద అంతస్థులో శివలింగ ప్రతిష్ట ఉంది ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పన్నెండు జ్యోతిర్లింగాల భావన కలిగిన శివ ప్రతిష్ట అద్భుతం. శివపార్వతుల తనయునికి ఇక్కడ చాలప్రాధాన్యత ఉంది. అందుకే 32 విఘ్నేశ్వర రూపాల ప్రతిష్ట ఉంది. బాల గణపతి నుండి యోగ గణపతి వరకు ఉన్న రూపాలకి నిత్యపూజలు జరిపే దేవాలయం ఇక్కడ మాత్రమే ఉంది.
అసామాన్య శిల్పకళాచాతుర్యం
మహాబలి పురం నుండి వచ్చిన శిల్పుల కళాచాతుర్యం ఇక్కడ ఉన్న విగ్రహాలలో జీవకళ ఉట్టిపడుతుంది. రుద్రుడు అంటేనే మానవ కష్టాలను హరించేవాడు అని అర్ధము. మహా రుద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి అతి రుద్ర మహా యజ్ఞం చేశారు ఈ యజ్ఞం చేయడం నిజంగా ఎంతో మహత్తర విషయం. పదకొండు రోజులపాటు 121 మంది వేద పండితులు 121 కలశాలతో అభిషేకం, పదకొండు సార్లు రుద్రా మంత్రం జపిస్తే ఫలప్రాప్తి కలుగుతుంది .అటువంటిది రెండుసార్లు జరగడం శివుని శక్తికి నిదర్శనం అని నమ్ముతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా భావంతో ఇక్కడకు భక్తులు వస్తుంటారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం
చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం 111.2 అడుగుల ఎత్తుతో, ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన శివలింగం గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇంతకుముందు, కర్ణాటకలోని కోటిలింగేశ్వర ఆలయంలోని 108 అడుగుల ఎత్తైన శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైనది గా ఉండేది.
10 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తు గల శివలింగం నిర్మాణం 2012 లోప్రారంభమైంది, దీని నిర్మాణం పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పట్టింది. దాని ఎత్తు మాత్రమే కాదు, దాని విశిష్టమైన స్థూపాకార నిర్మాణం, దానిలోపల దాగి ఉన్న అద్భుతమైన ఆశ్చర్యాలు కూడా చూడటానికి ఒక అద్భుతం.
కాశీ, గంగోత్రి, రిషికేశ్, రామేశ్వరం, ధనుష్కోడి, బద్రీనాథ్, గోముఖ్, కైలాసం వంటి వివిధ పుణ్యక్షేత్రాల నుండి నీరు, ఇసుక, మట్టిని కూడా నిర్మాణ సామగ్రిలో కలిపారు. అందువల్ల, చెంకల్ మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలోని శివలింగం ఒక దైవిక నిర్మాణంగా భావిస్తారు.
ఈ కట్టడంలో 8 అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఆరు అంతస్తులు మానవ శరీరంలోని ఆరు చక్రాలు లేదా శక్తికేంద్రాలకుప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ అంతస్తులలో భక్తులు, యాత్రికులు, పర్యాటకులు ఆయా చక్రాలపై ధ్యానం చేయడానికి 6 ధ్యానమందిరాలు ఉన్నాయి. ఈ కట్టడం మొదటి అంతస్తులో 108 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి, ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు.
భక్తులు మహా శివలింగంలోకి ప్రవేశించవచ్చు. ఈ శివలింగం లోపల, శివలింగం విశ్వ ప్రభావాన్ని అనుభవించడంతో పాటు, శరీరంలోని చక్రాల శక్తిని పెంచుకోవడానికి ధ్యానం కూడా చేయవచ్చు. – ఈఎస్ మాధవన్, విశాఖపట్నం


