మంచి జీతం, ఓ కారు, ఇల్లు ఉంటే..ఎవ్వరైనా ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనుకుంటారు. ఇన్ని సౌకర్యాలు ఉంటే మస్తు హ్యాపీగా సాగిపోతుంది జీవితం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇన్ని ఉన్నా తను పేదవాడినని చెబుతుండటం విశేషం. అంతేగాదు అనారోగ్య సమస్యలతో వైద్యుని వద్దకు వచ్చి తన పరిస్థితి వివరించడంతో డాక్టర్ సైతం విస్తుపోయాడు. చివరికి అతడి గురించి క్షుణ్ణంగా విచారించగా..అసలు విషయం తెలిసి వైద్యుడికి నోట మాట రాలేదు. అంతేగాదు చాలామంది ప్రముఖులు, గొప్ప గొప్ప నిపుణులు ఈ సమస్యతోనే బాధపడుతున్నారంటూ ఆ వ్యక్తి కేసు గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సన్నీ గార్గ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పట్టణాల్లో, నగరాల్లో ఉంటున్న వృత్తి నిపుణుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు లేవనెత్తాయి. ఆ డాక్డర్ 34 ఏళ్ల గుర్గావ్ నివాసి కథను పంచుకున్నారు. పైకి చూస్తే ఆ వ్యక్తి బాగా డబ్బున్న వాడిలా సక్సెస్ఫుల్ మ్యాన్లానేఉన్నాడు. అతడి జీతం కూడా ఏడాదికి రూ. 40 లక్షల జీతం, డబుల్ బెడ్రూం ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు అన్నీ ఉన్నాయని అన్నారు. అయితే అతడు మాత్రం తాను చాలా పేదవాడినని, అందుకే రాత్రి పూట నిద్రపోలేకపోతున్నా, విపరీతమైన ఒత్తిడికి గుర్వవుతున్నా అంటూ తన వద్దకు వచ్చాడని చెప్పుకొచ్చారు డాక్టర్ సన్నీ.
ఒక్కసారిగా విస్తుపోయిన డాక్టర్ సన్నీ అతడి విషయాన్ని కొట్టపారేయకుండా..బాగా సక్సెఫుల్ అయిన నిపుణుల్లో పెరుగుతున్న అభద్రత భావమే ఈ సమస్యకు కారణమని గుర్తించారు. ఈ వ్యక్తి ఆర్థికంగా విజయవంతమైనవాడే కానీ పోల్చుకోవడం అనే సమస్య నుంచి పుట్టుకొచ్చిన ఆందోళనలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏళ్లు గడిచే కొద్దీ అతడి పోల్చుకునే ధోరణి ఎలా మారిపోయిందో వివరించారు. మొదట తన సొంత ఊరి వాళ్లతో లేదా సాంప్రదాయ వృత్తుల ఉన్నవాళ్లతో పోల్చుకున్నాడు.
దాన్ని అధిగమించి ఓ స్థాయికి వచ్చాక..ఇప్పుడు ఏకంగా చిన్న వయసులో కోట్లలో సంపాదిస్తున్న స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలతో పోల్చుకుంటూ బాధపడుతున్నాడని అన్నారు. ఆ కారణంగానే తాను పేదవాడినని పేర్కొన్నాడని అన్నారు. దీన్ని డాక్టర్ సన్నీ "ఆధునిక పేదరికం"గా అభివర్ణించారు. ఇక్కడ డబ్బు లేకపోవడం కాదు, ఆదాయం కంటే అంచనాలు వేగంగా పెరగడం, సంతృప్తి లేకపోవడమే కారణమని అన్నారు. అంతేగాదు ఆ వ్యక్తిని మూడు ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. మొదటి గతేడాది నేను బెటర్ అని ఎన్నిసార్లు అనుకున్నావ్ అని అడిగగా.. దానికి నో అనే సమాధానం.
రెండో ప్రశ్నగా.. ఈ డబ్బంతా ఎవరి కోసం సంపాదిస్తున్నావు? తన చుట్టూ ఉన్నవారికంటే బెటర్గా ఉండటం కోసం అని రిప్లై ఇచ్చాడు. ఇక చివరగా డబ్బు లేదా వృత్తిపరమైన పురోగతి కోసం కాకుండా చేసిన మంచి పని ఏమైనా ఉందా అని అడిగగా..నో అనే సమాధానం ఇచ్చాడని అన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కేసులో డబ్బు కొలమానంగా మారడంతో...ప్రతి పనిలోనూ తాను మనిషిగా ఉండటం మానేసి ఒక యంత్రంగా మారిపోయాడని అన్నారు డాక్టర్ సన్నీ.
అంతేగాదు ప్రజలు నిరంతరం విజయగాథలు, విలాసవంతమైన జీవనశైలులు, అసాధారణ సంపదలు ఆకర్షణగా మారి పోలిక అనే వ్యసనం బారిన పడుతున్నారని..అదే ఒత్తిడి, మానసిక సమస్యలు బారినపడటానికి ప్రధాన కారణమని చెప్పారు. నెటిజన్లు కూడా వైద్యుడి మాటకు మద్దతిస్తూ..పోలిక ఎల్లప్పుడూ మనిషి ఆనందాన్ని చంపేస్తుందని, అన్నింట్లకంటే ఆత్మసంతృప్తి అత్యంత ముఖ్యం అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.
(చదవండి: భారత్ టీచరమ్మకు గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు)


