
– సాహిత్య అకాడెమీ బాల సాహిత్య పురస్కార విజేత గంగిశెట్టి శివకుమార్
న్యూస్మేకర్
‘మేము చదువుకునే సమయంలో రోజూ మోరల్ ఇన్స్ట్రక్షన్ (ఎం.ఐ.) అనే క్లాస్ ఉండేది. పిల్లల్ని కూచోబెట్టి సార్లు ఒక కథ వినిపించి అందులోని నీతి వివరించేవారు. అసలు నేడు పిల్లలకు ఇంటా బయటా మౌలిక భావాలు ఎవరు చెబుతున్నారు? పెద్దవాళ్లకా టైమ్ లేదు. మరి పిల్లలకు పరోపకారం చేయాలని, దేశభక్తి కలిగి ఉండాలని, మూఢ భావాలు ఉండకూడదని, అందరి పట్లా సమ భావన కలిగి ఉండాలని, ఆధునిక భావాలు కలిగి ఉండాలని... ఎవరు చె ప్పాలి? బాల సాహిత్యమే చె ప్పాలి.
పిల్లల చేత పుస్తకాలు చదివిస్తే తప్ప ఇవాళ వారిలో కనిపిస్తున్న దుర్లక్షణాలు పోవు’ అన్నారు గంగిశెట్టి శివ. 71 ఏళ్ల శివకుమార్ దాదాపు యాభై ఏళ్లకు పైగానే బాల సాహిత్యం రాస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను ఆయన పుస్తకం ‘కబుర్ల దేవత’కు బాల సాహిత్యం కేటగిరిలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా ‘సాక్షి ఫీచర్స్ ప్రతినిధి’తో శివకుమార్ సంభాషణ...
→ బాల సాహిత్యంలోకి ఎలా వచ్చారు?
శివకుమార్: మాది నెల్లూరు జిల్లా రాపూరు. మా నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు. తరుచూ బాలమిత్ర, చందమామ ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో వాటిని చేత్తో తాకడమే పెద్ద సంబరం. 13 ఏళ్ల వయసులో అవి చదివి అలా నేను కూడా కథలు రాయాలనుకునేవాణ్ణి. 14వ ఏట మొదటి కథ పోస్ట్ చేశాను. అప్పటి నుంచి పిల్లల కథలు రాసి పత్రికలకు పంపించడం మొదలుపెట్టాను.
→ కథల్లో పిల్లలకు ఏం చెబుతుంటారు?
జ: నేను కొడవటిగంటి కుటుంబరావు గారి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయనలాగే పిల్లల్లో ఆలోచన, విచక్షణ పెరిగే సాహిత్యం ఉండాలని కోరుకుంటాను. మంత్రాలు, తంత్రాలు కాకుండా హేతువుకు ప్రాధాన్యం పెరిగేలా రాశాను. బాలసాహిత్యం చదివిన పిల్లలు తమకు తాము మేలు చేసుకోవాలి, సమాజానికి మేలు చేయాలి. ఇవి చేయడానికి వీలు కల్పించని సాహిత్యం మంచి బాల సాహిత్యం కాదు. ఇవాళ్టి పిల్లలు రేపటి ΄ పౌరులు మాత్రమే కాదు మహా పురుషులు కావాలి. కాని ఏ మహాపురుషుడి గురించి వీరు తెలుసుకుంటున్నారు... చదువుతున్నారు? మనందరం గాంధీ, నెహ్రూ గాథల నుంచి కదా ఇన్స్పయిర్ అయ్యింది?
→ ఇప్పటి వరకూ ఎన్ని పుస్తకాలు రాశారు?
జ: పది పుస్తకాలు రాశాను. కథలు వందల కొద్దీ రాశాను. నేను బి.ఎస్సీ చదివి తెలుగు ఎం.ఏలోకి వచ్చాను భాష మీద ప్రేమతో. ఇవాళ ఎంతమంది అలా వస్తున్నారు? భాష, సాహిత్యాలకు బడులలో ప్రాధాన్యం లేదు. మార్కులు, ర్యాంకులు ప్రధానమయ్యాయి తల్లిదండ్రులకు. వ్యక్తిత్వం మార్కులతో, ర్యాంకులతో రాగలదా? వ్యక్తిత్వ నిర్మాణమే దేశ నిర్మాణం అని తెలుసుకోవాలి. ఇవాళ టీచర్ల మీద దాడి చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులను ఆదరించని పిల్లలు ఏ సంస్కృతికి ప్రతిఫలం? ఇలాంటి పిల్లలు గొప్ప సాహిత్యం, నైతిక విలువలు పాదుకొలిపే పుస్తకం ఒక్కటి కూడా చదివి ఉండరు. వీరి చేత చదివించని పెద్దలు వీరి నుంచి మంచి నడవడికను మాత్రం ఆశిస్తారు. అదే విచిత్రం.
→ ‘కబుర్ల దేవత’ పుస్తకానికి మీకు పురస్కారం వచ్చింది. ‘కబుర్ల దేవత’ కథ పేరు. అందులో ఏముంది?
జ: కొంతమంది మాటలు చెప్పి బతగ్గలరు. అదొక స్కిల్. అది అందరికీ రావాలని లేదు. అంతమాత్రాన పనిమంతుడికి విలువ తగ్గదు. పని తెలిసినవాడు తన పని తాను చేసుకెళ్లాలి. దానికీ ఫలితం ఉంటుంది. మాట్లాడేవాళ్లను చూసి బెదరిపోవద్దు అనే వ్యక్తిత్వ వికాస కోణంలో ఆ కథ పిల్లలకు చె ప్పాను.
→ మీకు నచ్చిన బాల సాహిత్యకారులు?
జ: కలువకొలను సదానంద గారు మంచి సాహిత్యం రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే శైలి వారిది. కె.సభా కూడా మంచి బాల సాహిత్యం రాశారు.
→ మీ ఇతర వివరాలు
జ: నేను నెల్లూరు జిల్లాలోనే వివిధ చోట్ల ఉ పాధ్యాయునిగా పని చేసి రిటైర్ అయ్యాను. మ అబ్బాయి చెన్నైలో, అమ్మాయి నెల్లూరులో స్థిరపడ్డారు. రిటైరయ్యాక కూడా ఒక స్కూల్ బాధ్యతలు చూస్తున్నాను. పిల్లలను కంట్రోల్ చేయడం ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. పిల్లలు ఇలా ఎందుకు ఉన్నారో అందరూ కలిసి ఆలోచించాలి. పిల్లల బాధ్యత సమాజం బాధ్యత అనుకోనంత వరకూ బాలల వికాసం పరిపూర్ణంగా జరగదు.