గాలి కుంటు వ్యాధి | Galikuntu: foot and mouth disease in animals | Sakshi
Sakshi News home page

గాలి కుంటు వ్యాధి

Apr 15 2025 12:51 AM | Updated on Apr 15 2025 12:51 AM

Galikuntu: foot and mouth disease in animals

వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తలే మేలు!

వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులు మొదలయిన చీలుగిట్టలుండే జంతువులకు సంక్రమించే వైరస్‌ వ్యాధుల్లో గాలికుంటు ముఖ్యమైనది. నోటికి, గిట్టలకు పుళ్లవుతాయి కాబట్టి ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ (ఎఫ్‌ఎండి) అంటారు. ఆప్తో వైరస్‌ ఈ వ్యాధిని కలిగిస్తుంది. ఇది సోకకుండా ముందు  జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. గాలి, ఇతర  మార్గాల్లో ద్వారా వ్యాపిస్తుంది. మరణాల శాతం తక్కువైనప్పటికీ, పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గి రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది.

టీకాలతో నివారణ ఉత్తమం
→ గాలికుంటు వ్యాధికి చికిత్సలేదు. నివారణ మార్గాలపై శ్రద్ధ వహించాలి. గాలికుంటు వ్యాధి టీకాలు మొదటిసారి 2 నెలల వయసులో, బూస్టర్‌ డోసు ఒక నెల తర్వాత చేయించాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. 
→ గాలికుంటు వ్యాధి నివారణకు 6 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వ పశు సంవర్థక శాఖ ఉచితంగా టీకా వేస్తోంది. రైతులు సమీపంలోని ప్రభుత్వ పశు వైద్యుడ్ని సంప్రదించి పశువులకు టీకాలు వేయించుకొని ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి తోడ్పడాలి.
→ వ్యాధిగ్రస్త పశువుల నోటి చొంగలో వైరస్‌ అధిక శాతం వుంటుంది. ఈ చొంగ పడిన మేత, దాణా, నీరు, మల మూత్రాదుల్లో సంవత్సరం వరకు వైరస్‌ దాగి వుంటుంది. అనుకూల పరిస్థితుల్లో తిరిగి వ్యాధిని కలిగిస్తుంది. అందువల్ల వ్యాధి సోకిన పశుశాలలను  సోడియం హైడ్రాక్సైడ్, 2% ఫార్మాలిన్, 4% సోడియం కార్బోనేటు వంటి మందులతో శుభ్రం చేస్తే వైరస్‌ నశిస్తుంది. 
→ ఆబోతుల, దున్నల వీర్యం ద్వారా కూడా ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. 3 నెలల వరకు సంపర్కానికి నియోగించకూడదు. వ్యాధి సోకిన పశువుల పాలు దూడలు తాగకుండా చూడాలి. సంత నుంచి తెచ్చిన పశువుల్ని మూడు వారాలు విడిగా వుంచి, పరిశీలించి, టీకాలు వేయించిన తర్వాత ఆరోగ్యంగా వున్న పశువులతో కలువనివ్వాలి.

గాలికుంటు వ్యాధి లక్షణాలు
→ గాలికుంటు వ్యాధి లక్షణాలు గొర్రెలు, మేకల్లో కన్నా పశువుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104– 106  డిగ్రీల సెల్షియస్‌ వరకు ఉంటుంది. 
→ నోటిలో చర్మపు పొరలు, పళ్ల చిగుళ్లు, నాలుక, ముట్టె లోపలి ప్రాంతాల్లో బొబ్బలు పొక్కి, చితకటం వల్ల పశువులు మేత తినవు. నోటి నుంచి చొంగ, నురుగు విపరీతంగా కారుతుంది. 
→ గిట్టల మధ్య, గిట్టపైన బొబ్బలు ఏర్పడి, చితికి పుళ్లవుతాయి. నొప్పి వల్ల పశువులు నడవలేక కుంటుతాయి. చను మొనలపై కూడా బొబ్బలు ఏర్పడి పొదుగు వాపు కనిపిస్తుంది.  
→ వ్యాధి సోకిన పశువుల పాలు తాగి దూడలు మరణిస్తాయి. దుక్కిటి పశువులు పనులకు ఉపయోగపడవు. చూలి పశువులకు గర్భస్రావాలవుతాయి. 
→ పశువులు రక్తహీనతకు గురై శ్వాస కష్టంగా పీల్చతూ, రొప్పుతూ, ఎండవేడికి తట్టుకోలేక నీరసించిపోతాయి. ఈ లక్షణాలన్నీ ఎక్కువగా సంకరజాతి పశువుల్లో కనిపిస్తాయి.

లక్షణాలకు అనుగుణంగా చికిత్స
→ వ్యాధి సోకిన పశువులను ఇతర పశు­వుల నుంచి వేరు చేసి, సత్వర చికిత్స చేయించాలి. వైరస్‌వ్యాధి కాబట్టి మందు­లు పనిచేయవు. వ్యాధి లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేయాలి. 
→ నోటిలోని పుండ్లను పొటాషియం పర్మాంగనేటు కలిపిన నీళ్లతో శభ్రం చేసి, వాటికి బోరోగ్లిజరిన్, యాంటి సెంప్టిక్‌ ఆయింట్‌మెంటు పూయాలి. కాలి పుండ్లకు జింక్‌ ఆక్సైడ్, లొరాక్సిన్, హిమాక్స్‌ వంటి ఆయింట్‌మెంట్‌ పూయాలి. 
→ ఈగలు వాలకుండా వేపనూనె, లినమెంట్‌ వంటి వాటిని వాడాలి. అలాగే నోటిలోని చిగుర్లు, పుండ్ల పొరలు అభివృద్ధికి విటమిన్‌–సి కలిగివుండే పౌడర్‌ ఆప్తోకేర్‌ వంటి వాటిని వాడాలి. 
→ బాక్టీరియా సోకకుండా యాంటిబయోటిక్‌ మందులు 3–5 రోజులు వాడాలి. ఉపశమనం కోసం మెలోక్షికమ్‌ మందులు వాడాలి. అలాగే విటమిన్లు, బి–కాంప్లెక్స్‌లతో కూడిన టానిక్‌లను ఇచ్చి వ్యాధి నిరోధక శక్తిని పెంచాలి. 
→ జావ/జొన్న అన్నం, చిటికెడు ఉప్పు, బెల్లం కలిపి ప్రతి రోజు తాగించటం ద్వారా బలహీనపడకుండా జాగ్రత్త వహించాలి. పశువు బాగా నీరసిస్తే గ్లూకోజ్‌ రక్తంలోకి ఇవ్వాల్సి వుంటుంది.

గృహ వైద్యం
→ పటిక లేదా వెలిగారమును కలిపిన నీటితో నోటి పుళ్ళు, కాలి పుండ్లను కడగాలి. పావు కిలో రాగులు, పావు కిలో పెసలు ఉడకబెట్టి, 250 గ్రాములు నువ్వుల నూనెలో బాగా పిసికి.. రోజుకు 2 సార్లు తినిపించాలి. కాళ్ళకు నువ్వుల నూనె కడియం వేయాలి.
→ జ్వరం తగ్గటానికి సురేకారం 20 గ్రాములు, ఉప్పు 30 గ్రాములు, నేలవేము 30 గ్రాములు, బెల్లం 120 గ్రాములు, అర లీటరు వేడి నీళ్ళలో కలిపి రోజుకు 2 సార్లు తాగించాలి.

హెూమియో చికిత్స
→ వ్యాధి ప్రబలిన ప్రాంతంలో పశువులకు మెర్క్‌ సోల్‌ 200 గానీ, కాల్‌ బైక్రోమికమ్‌ 200 గానీ, సిఫిలినం 200 గానీ ఏదో ఒకదాన్ని వాడితే వ్యాధి సోకకుండా పశువులను కాపాడుకోవచ్చు. 10 మాత్రలు చొప్పున ప్రతి రోజూ ఒకసారి తినిపిస్తే వ్యాధినిరోధకంగా పనిచేస్తుంది. 
→ వ్యాధి సోకితే అది తగ్గటానికి.. మెర్క్‌ సోల్‌ 200 లేదా కాల్‌ బైక్రోమికమ్‌ 200 లేదా సిఫిలినం 200 లేదా ఎకినేసియా 200 లేదా బోరాక్స్‌ 200 లేదా కాలి క్లోరాటం 200.. వీటిలో ఏదైనా ఒక మందును 10 మాత్రలు చొప్పున రోజుకు 2 సార్లు దొన తినిపించాలి.
→ నోరు పుళ్ళు పడినపుడు బోరాక్స్‌ లేదా హైడ్రాస్టిస్‌ లేదా హైడ్రాస్టినమ్‌ మ్యూరియటికం లేదా ఎకినేసియా ‘క్యూ’.. వీటిలో ఏదైనా ఒక 
మందు మదర్‌ టింక్చర్‌ను 1 మి.లీ.ను 10 మి.లీ. నీటిలో కలిపి నోటి పుళ్ళు కడగాలి. 
→ డెక్కెల మధ్య పుళ్ళకు ఎకినేసియా లేక కాలెండ్యుల మదర్‌ టింక్చర్‌ను సమపాళ్ళలో కొబ్బరి నూనెలో గాని వ్యాసలైన్లో గానీ కలిపి రాయాలి.
→ జ్వర తీవ్రత వుంటే హెపార్‌ సల్ఫ్‌ 1ఎం లేదా రుస్‌టాక్స్‌ 1ఎం మందును 10 మాత్రలు చొప్పున రోజుకు 2 సార్లు తినిపించాలి.

– డాక్టర్‌ జి. రాంబాబు, పశువైధ్యాధికారి, కడప.
మొబైల్‌: 94945 88885

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement