కట్నంగా కిడ్నీ | Donate kidney: Bihar woman faces dowry demand from in laws | Sakshi
Sakshi News home page

కట్నంగా కిడ్నీ

Jun 18 2025 12:05 AM | Updated on Jun 18 2025 12:05 AM

Donate kidney: Bihar woman faces dowry demand from in laws

వరకట్నమా... అదెక్కడుంది? అని పైకి అంటున్నారు గానీ లాంఛనాలు నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఎన్ని అప్పులు చేస్తున్నారో సమాజానికి తెలుసు. తాజాగా బిహార్‌లో ఒక ఘటన ఉలిక్కిపడేలా చేసింది. వరుడు అడిగిన మోటార్‌ సైకిల్‌ని పెళ్లికూతురు ఇవ్వలేననేసరికి ‘పోనీ కిడ్నీ ఇవ్వు..  అమ్ముకుంటాం’ అన్నారు. దాంతో పెద్ద కేసయ్యి పెళ్లి ఆగిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు తగ్గి ఉండాల్సిన అవసరం ఇంకా ఉందా?  

వాళ్లు మొదట బైక్‌ అన్నారు. లేదా నాలుగు లక్షల క్యాష్‌ అన్నారు. లేదా కిడ్నీ అన్నా ఇవ్వు అంటున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఉంటున్న దీప్తి అనే మహిళ ఈ విషయమైన పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ చేయడానికి వస్తే పోలీసులు కూడా డంగై పోయారు. విషయం ఏమిటంటే– దీప్తికి 2021లో పార్థ్‌ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో దీప్తి వివరించింది– ‘మా అమ్మా నాన్నలు నా పెళ్లి కోసం 30 లక్షలు ఖర్చు పెట్టారు.

అయినా అత్తవారింటిలో అడుగు పెట్టినప్పటి నుంచి కట్నం కోసం సూటి పోటి మాటలు వినిపించేవి. మా అత్తగారు ఆయుర్వేద దుకాణం తెరవడానికి మరో 8 లక్షలు తెమ్మని నన్ను కోరారు. నేను అతి కష్టం మీద 3 లక్షలు నాన్నను అడిగి తెచ్చాను. రెండేళ్ల క్రితం నా భర్తకు కిడ్నీ వ్యాధి ముదిరింది. అది పెళ్లికి ముందే ఉంటే దాచి పెళ్లి చేశారు. మేము ఢిల్లీకి వెళ్లి అక్కడ మా ఆడపడుచు ఇంట్లో ఉండి వైద్యం చేయించాం. అక్కడి నుంచే నాకు సమస్యలు మొదలయ్యాయి’ అని తెలిపిందామె.

డబ్బు లేదా కిడ్నీ
దీప్తిని ఆమె అత్తామామలు మొదట బైక్‌ అడిగారు. తర్వాత నాలుగు లక్షలు తెమ్మన్నారు. తర్వాత భర్తకు కిడ్నీ అయినా ఇవ్వు అని డిమాండ్‌ చేశారు. దీప్తి ఇవ్వను అని చెప్పేసరికి పుట్టింటికి తరిమేశారు. దాంతో తట్టుకోలేకపోయిన దీప్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే విడాకులు కావాలని డిమాండ్‌ కూడా చేసింది. భర్త ఇందుకు నిరాకరించినా దీప్తి మాత్రం ఈ పెళ్లి నుంచి బయటపడాలని నిశ్చయించుకుంది. కేసు దర్యాప్తులో ఉంది.

మెడకు చుట్టుకుంటున్న లాంఛనాలు
కట్నం అనే మాట మన దేశంలో ఎట్టకేలకు అనాగరికంగా మారాక ఆడపెళ్లివారికి ఖర్చులు మరో విధంగా చుట్టుముట్టాయి. వాటిలో ప్రధానమైనది బంగారం. పిల్లకు ఏం పెడతారు అనే విషయం చాలా పెద్ద సమస్య– బంగారం రేటును తలుచుకుంటే! అలాగే కల్యాణ మంటపం, భోజనాలు, ఇతర ఆర్భాటాలు మహామహులను కూడా అప్పుల పాలు చేస్తున్నాయి. పెళ్లయ్యాక కూడా ఆ ఖర్చు అనీ ఈ ఖర్చు అనీ అల్లుళ్లు పిండేస్తున్నారు. కార్లు అడిగే అల్లుళ్లు కొందరైతే వ్యాపారానికి పెట్టుబడి అడిగేవారు కొందరు. ఇటు భర్తకు సర్ది చెప్పలేక అటు తల్లిదండ్రులను అడగలేక ఆడపిల్లలు పోకచెక్కలవుతున్నారు.

అమ్మాయికి ఏం తక్కువ?
ఇన్నేళ్ల తర్వాత కూడా అమ్మాయి డబ్బు ఇచ్చేదిగా అబ్బాయి డబ్బు తీసుకునేవాడిగా వివాహ వ్యవస్థ ఉండటం విషాదం. ఆడపిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ మరో వైపు కుటుంబంలో కీలకపాత్ర పోషిస్తూ ఉన్నా ‘తగ్గి ఉండే’ ధోరణిని సమాజంప్రోత్సహిస్తూనే ఉంది. విద్యావంతులైన వధూవరులు పెళ్లి విషయంలో పరస్పర గౌరవనీయమైన లాంఛనాలను చర్చించి ఎవరికీ ఇబ్బంది, ఆర్థిక భారం కలిగించని వాటికే చోటిస్తూ వివాహానికి అంగీకరించాలి. అందుకు పెద్దల్ని ఒప్పించాలి. పెద్దలు ఏవేవో డిమాండ్లు పెట్టి, నెరవేర్చుకుని పక్కకు తప్పుకున్నాక కాపురం చేయాల్సింది వధువరులే. కనుక పరస్పర గౌరవానికి చోటుండే వివాహాలపై వారే ముందడుగు వేయాల్సి ఉంది.

మరాఠాలు ఇస్తున్న సందేశం
మొన్నటి మే నెలలో పుణెలోని వైష్ణవి హగవానె అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది.  కారణం – వరకట్న వేధింపులు. ఈ ఆత్మహత్య మహరాష్ట్రలో సంచలనం సృష్టించింది. దీనికి విరుగుడు కనిపెట్టడానికి మరాఠా సమూహాలు వరకట్నాన్ని, పెళ్లి ఆర్భాటాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. పుణె చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ పెరిగి రైతుల భూములకు రెక్కలొచ్చాయి. బిల్డర్లకు భూములు అమ్మిన రైతులు భారీగా ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు. వీటిని చూసి సగటు మధ్యతరగతి వారు కూడా చేతులు కాల్చుకుని అప్పుల పాలవుతున్నారు. ఎంత ఖర్చయినా పర్లేదు... మంచి కుర్రాణ్ణి తేవాలని వేలానికి దిగుతున్నారు. వీటన్నింటిని నిషేధిస్తూ మరాఠా పెద్దలు ప్రచారం చేస్తున్నారు. అక్కడి నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తుండటంతో ప్రభావం కనపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement