సనాతన ధర్మం నాయకత్వాన్ని కేవలం అధికారం చలాయించే సాధనంగా చూడదు; అది ఒక పవిత్రమైన బాధ్యత, త్యాగంతో కూడిన ధర్మ నిర్వహణ. నాయకుడు అంటే ఆజ్ఞలు జారీ చేసే యజమాని కాదు, తన ఆచరణతో దారి చూపే నిశ్శబ్ద విప్లవకారుడు. ఉత్తముడైన నాయకుడు ఏ మార్గంలో నడుస్తాడో, లోకం ఆ అడుగుజాడలనే అనుకరిస్తుంది. అధికార గర్వం దరిచేరనీయక, వినయంతో లోక కల్యాణం కోసం శ్రమించేవాడే అసలైన మహానాయకుడు.
నాయకత్వానికి మొదటి మెట్టు నిస్వార్థం. తన ప్రయోజనం కన్నా సామాజిక హితం గొప్పదని భావించే వ్యక్తి మాత్రమే ప్రజల అంతరంగంలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. చందన వృక్షం తనను తాను అరగదీసుకుంటూ చుట్టూ ఉన్న గాలిని సుగంధభరితం చేసినట్లు, నాయకుడు తన వ్యక్తిగత సుఖాలను త్యాగం చేస్తూ సమాజానికి మేలు చేకూర్చాలి. పదవి అంటే వ్యక్తిగత లాభాల కోసం లభించిన అవకాశం కాదు, అది ఆర్తుల కన్నీటిని తుడిచి ప్రజలకు సేవ చేసే అరుదైన సౌభాగ్యం. నిస్వార్థ ప్రయాణంం నాడు విలువల కోసం పదవులను తృణ్రపాయంగా వదులుకున్న మహనీయులు ఉండేవారు.
వివేచన
ధర్మబద్ధమైన నిర్ణయంం లక్ష్యాలు ఎంత గొప్పవో, వాటిని సాధించే మార్గాలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. గమ్యం చేరుకోవడానికి అడ్డదారులు తొక్కడం నాయకత్వానికే కళంకం. పాలు తాగిన పాము విషాన్ని మాత్రమే చిమ్మినట్లు, దుర్మార్గమైన ఆలోచనలతో కూడిన అధికారం వినాశనాన్ని మాత్రమే మిగిలిస్తుంది. పాల నుండి వెన్నను వేరు చేసే మథనం వలె, నాయకుడు క్లిష్ట పరిస్థితుల్లోనూ నిజాన్ని, నిప్పును వేరు చేసే సునిశిత విచక్షణ కలిగి ఉండాలి. అధికారం ఆయుధం వంటిది; అది రక్షించడానికి వాడితే దైవత్వం, భక్షించడానికి వాడితే రాక్షసత్వం అవుతుంది. కలుషితమైన విత్తనం నుండి ఆరోగ్యకరమైన ఫలాలు ఆశించడం ఎంత భ్రమయో, అనైతిక మార్గాల్లో సాగే పాలన నుండి సుఖశాంతులు ఆశించడం కూడా అంతే అత్యాశ.
సమన్వయం: సమభావం – సంస్కారం
ఉత్తమ నాయకుడు తన అనుచరులను బానిసలుగా కాకుండా, తన గమ్యంలో సమాన భాగస్వాములుగా చూస్తాడు. మన అరచేతికి ఉన్న వేళ్ళు అన్నీ ఒకే రీతిలో ఉండవు, ఒక్కో వేలుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ, ఆకలి తీర్చుకోవడానికి ఆ ఐదు వేళ్ళూ ఏకమైతేనే పట్టు దొరుకుతుంది. అలాగే, ఒక వ్యవస్థలో భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉండవచ్చు. వారందరినీ సమన్వయపరుస్తూ, వారిలోని వైవిధ్యాన్ని గుర్తించి ఏకతాటిపై నడిపించడమే నాయకత్వ వైశిష్ట్యం. ఉప్పు సముద్రంలో ఉన్నప్పుడు చేదుగా అనిపించినా, వంటకంలో చేరినప్పుడు రుచిని ఇస్తుంది. అలాగే నాయకుడు కఠినంగా కనిపించినా, ఆ క్రమశిక్షణ వ్యవస్థ బాగు కోసమేనని గ్రహించాలి. చిత్తశుద్ధి కలిగిన మనసు రాజ్యాన్ని రామరాజ్యంగా మారుస్తుంది.
ధర్మబద్ధమైన నాయకత్వం విశ్వశాంతికి మూలం. పదవి అనేది తాత్కాలికమైన విడిది వంటిది, అది ఏ క్షణమైనా ముగిసిపోవచ్చు. కానీ ఆ పదవిలో ఉండి చేసిన సత్కార్యాలు అజరామరంగా నిలిచిపోతాయి. బాధ్యతను విస్మరించి అధికార కాంక్షతో రగిలిపోయే వారికి కాలమే గట్టి బుద్ధి చెబుతుంది. పూలమాలలోని దారం కనిపించదు కానీ, అది పువ్వులన్నింటినీ కలిపి ఉంచుతుంది; అలాగే నాయకుడు కూడా తెరవెనుక ఉండి వ్యవస్థను సుస్థిరంగా నిలబెట్టాలి. మేఘం కరిగి వర్షమై నేలని పునీతం చేసినట్లు, నాయకుడి అధికార గర్వం కరిగి సేవాభావంగా మారినప్పుడే పాలకుడికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ప్రతి అడుగు ధర్మబద్ధం కావాలి, ప్రతి నిర్ణయం లోకహితం కోరాలి. భారతీయ నాయకత్వ విలువలు జగత్తుకు మార్గదర్శకం కావాలి. సత్యం వర్ధిల్లాలి, ధర్మం నిలవాలి, లోకమంతా శాంతి సౌఖ్యాలతో వెల్లివిరియాలి.
– కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు


