టెక్ ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుసరించే ప్రశాంతమైన నాయకత్వ శైలి వెనుక ఉన్న రహస్యాన్ని రివీల్ చేశారు. దశాబ్దాల క్రితం హవాయి తీరంలో జరిగిన ఒక స్కూబా డైవింగ్ అనుభవం నేడు ప్రపంచ స్థాయి నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆయనకు ఒక దిశానిర్దేశక సూత్రంగా నిలుస్తున్నట్లు చెప్పారు.
అలల గందరగోళం... అడుగున నిశ్శబ్దం
చాలా ఏళ్ల క్రితం హవాయి తీరంలో స్కూబా డైవింగ్ చేస్తున్న సమయంలో పిచాయ్ అనుకోని చిక్కుల్లో పడ్డారు. సముద్రపు ఉపరితలంపై అలలు ఉధృతంగా ఉన్నాయి. నీటిలోకి దిగగానే సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వెనక్కి వెళ్లిపోవాలన్న ఆలోచన ఆయనకు కలిగిందట. అయితే, భయపడకుండా మరింత లోతుకు డైవ్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఆయన జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సముద్ర ఉపరితలంపై ఉన్న గందరగోళం, అలల వేగం అంతా కొన్ని అడుగుల లోతుకు వెళ్లేసరికి మాయమైపోయింది. అక్కడ అత్యంత ప్రశాంతమైన, నిశ్చలమైన వాతావరణాన్ని అనుభవించాను. ఆ క్షణం ఇంకా నా మదిలో నిక్షిప్తమై ఉంది’ అన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో స్పష్టత
తరువాతి కాలంలో ఆల్ఫాబెట్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన పిచాయ్ తన నాయకత్వ శైలి గురించి వివరిస్తూ తరచుగా ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటారు. గూగుల్ వంటి అతిపెద్ద సంస్థను నడపడం అంటే.. నిరంతరం మారుతున్న నిబంధనలు, కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న పెను మార్పులు, ప్రపంచ ప్రభావం చూపే కీలక నిర్ణయాల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ‘ఉపరితలంపై ఉండే గందరగోళానికి వెంటనే ప్రతిస్పందించడం కంటే, లోతుల్లోకి వెళ్లి స్పష్టతను వెతుక్కోవడం ముఖ్యం’ అని ఆయన విశ్వసిస్తారు. క్లిష్ట సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తూ దీర్ఘకాలిక ఫలితాలపై దృష్టి పెట్టడమే ఉత్తమమైన మార్గమని పిచాయ్ నిరూపించారు.
సహకారంతో కూడిన నాయకత్వం
సాంకేతిక రంగంలో చాలామంది దిగ్గజాలు దూకుడుగా, ఘర్షణాత్మక శైలిలో నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతుంటారు. కానీ, పిచాయ్ శైలి పూర్తిగా భిన్నమైనది. ఆయన నిర్ణయాల్లో సహకారం, అంతర్గత సమన్వయం స్పష్టంగా కనిపిస్తాయి.
ప్రతి సవాలుకు ఆవేశంగా స్పందించడం కంటే, సంక్లిష్ట పరిస్థితుల్లో సమతుల్యతను కోల్పోకుండా ఉండటమే గొప్ప నాయకత్వ లక్షణమని పిచాయ్ భావిస్తారు.
తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేయడం ఆల్ఫాబెట్ వృద్ధికి దోహదపడింది.
అనిశ్చితి నెలకొన్న సమయంలో నాయకుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మొత్తం సంస్థ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని ఆయన నమ్ముతారు.
ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన


