టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భవిష్యత్తు ప్రణాళికలపై ఆ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో కంపెనీ బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇదే క్రమంలో భారతీ టెలికాం వాటాను తిరిగి 50 శాతానికి పైగా పెంచుకోవాలన్న తన వ్యక్తిగత ఆకాంక్షను ఆయన పంచుకున్నారు.
వారసత్వానికి రోడ్ మ్యాప్..
ప్రస్తుతం సెప్టెంబర్ 30, 2031 వరకు ఐదేళ్ల కాలానికి బోర్డు ఛైర్మన్గా తిరిగి నియమితులైన మిట్టల్, తన పదవీకాలం ముగిసే సమయానికి సంస్థను పటిష్టమైన స్థితిలో వారసులకు అందించాలని భావిస్తున్నారు. గతంలో భారతీ టెలికాం 51% వాటాను కలిగి ఉండేది. ప్రస్తుతం ఇది కొంత తగ్గినప్పటికీ తాను తప్పుకునే సమయానికి తిరిగి 51% లేదా కనీసం 50% పైగా వాటాను ప్రమోటర్ల చేతుల్లోకి తీసుకురావాలని మిట్టల్ ఆశిస్తున్నారు.
సంస్థాగత నిర్మాణం
కంపెనీ నిర్వహణ మొత్తం ఒకే గొడుగు కింద ఉండాలని, ప్రమోటర్లు నియంత్రణ వాటాదారులుగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. ‘ఇంతటి భారీ పరిమాణం ఉన్న సంస్థలో 10% వాటాను పెంచడం అంటే చిన్న విషయం కాదు, కానీ అది నా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే..


