
ప్రకృతి వైపరిత్యాలు ఎవ్వరికి ఎలాంటి విషాదాన్ని ఇస్తుందో చెప్పలేం. అమాంతం ఉప్పెనలా విరుచుకపడే ఆ విలయం మిగిల్చే బాధ మాటలకందనిది. అందుకు సంబంధించి ఎన్నో ఉదంతాలను చూశాం. అలానే ఇటీవల కురిసిన భారీ వర్షాలు హిమచల్ ప్రదేశాన్ని ఎంతలా అతలా కుతలం చేశాయో తెలిసిందే. అయితే దాని కారణంగా అనాథగా మారిన ఓ చిట్టితల్లి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎలా బతికి బట్టగట్టకలిగిందంటే..
అసలేం జరిగిందంటే..ఎడతెరపిలేని వర్షాలకు వరదలు సంభవించి హిమచల్ప్రదేశ్ అతలాకుతలమైన సంగతి తెలిసింది. ఈ ప్రకృతి వైరిత్యం కారణంగా భారీగా ఆస్తి, జన నష్టం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో హిమచల్ ప్రదేశ్లోని సిరాజ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం మొత్తం ఈ విపత్తుకు బలైపోయింది. ఆ కుటుంబానికి చెందిన 11 నెలల కూతురు ఒక్కత్తే బతికి బట్టగట్టగలిగింది. ఈ విపత్తు కారణంగా ఒరిగిపోయిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఆ చిన్నారి లభించడం విశేషం.
ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఆ చిన్నారి ఇల్లు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల్లి, తండ్రి, నానమ్మ చనిపోగా, ఆ చిన్నారి ఒక్కత్తే అనాథగా మిగిలిపోయింది. ఇవేమి ఆ చిన్నారికి తెలియక అమాయకంగా అందరిని చూస్తున్న తీరు అందరిని కలచివేస్తోంది. శిథిలంగా మారిన ఆ ఇల్లు పర్వాడ గ్రామానికి చెందని రమేష్ ఇల్లుగా గుర్తించారు. ఆ ఇల్లు డ్రెయిన్ సమీపంలో ఉండటంతో, జూన్ 30న కురిసిన వర్షాలకు నీటి ఉద్ధృతి ఎక్కువై కొట్టుకుపోయింది.
అయితే దీనిని ముందుగానే గమనించి రమేష్ కూతురిని ఇంటిలోపల పడుకోబెట్టి, తన భార్య తల్లితో కలిసి ఇంటి వెనకకు వెళ్లాడు. అంతే ఆ వరద ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఐతే చిన్నారి ఇంటిలోనే ఉండటంతో సురక్షితంగా శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉందని చెబుతున్నారు అధికారులు. ఆ చిన్నారి పేరు నిఖితగా గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది ఆ చిన్నారి తండ్రి మృతదేహాన్ని వెలికితీశారు కానీ తల్లి, భార్య మృతదేహాలు మాత్రం కానరాలేదు.
అందుకోసం ముమ్మరంగా గాలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఆ చిన్నారి మేనత్త తారాదేవి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఈ హృదయవిదారక ఘటన గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున అభ్యర్థనలు రావడం విశేషం.
విత్తుల సహాయ నిర్వహాణ అధికారి స్మృతికా నేగి ఆ చిన్నారి నికితా బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి తన మేనత్త పర్యవేక్షణలో ఉందని తెలిపారు. కాగా, ఈ హిమచల్ప్రదేశ్ వర్ష బీభత్సానికి సుమారు 700 కోట్ల మేర ఆస్తి నష్టం తోపాటు 69 మంది దాక మృత్యువాత పడ్డారు.
(చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...)