ప్రగతి మాటున ప్రమాదం! | - | Sakshi
Sakshi News home page

ప్రగతి మాటున ప్రమాదం!

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

ప్రగతి మాటున ప్రమాదం!

కార్పొరేట్‌ సంస్థల చర్యలు.. ప్రజా నిరసనలు

ప్రజా డిమాండ్‌

చింతలపూడి : రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయ ల ఆదాయం, పరిశ్రమలకు ఊతం లభిస్తుందనే ని నాదాల వెనుక... పచ్చని గోదావరి సరిహద్దు ప్రాంతాన్ని మరుభూమిగా మార్చే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని రేచర్ల బొగ్గు నిల్వలను ఆధారంగా చేసుకుని రిలయన్స్‌ సంస్థ దాదాపు రూ.2.73 లక్షల కోట్ల భారీ అంచనాతో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 30 ఏళ్ల కాలంలో రాయల్టీ, రెవెన్యూ, డీఎంఎఫ్‌ రూపంలో సుమారు రూ.65,000 కోట్ల ఆదా యం ప్రభుత్వానికి సమకూరుతుందనే అంచనాలతో అధికారులు వేగంగా పావులు కదుపుతున్నా రు. అయితే, ఈ ప్రాజెక్టు వల్ల తలెత్తే పర్యావరణ వి ధ్వంసం, దీర్ఘకాలిక దుష్ప్రభావాలపై శాసీ్త్రయ అధ్యయనం లేకుండా ముందుకెళ్లడంపై రైతులు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ యూసీజీ ?

భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ అనేది సాధారణ సాంప్రదాయ మైనింగ్‌ వంటిది కాదు. భూమి లోపల ఉన్న బొగ్గు పొరలలోకి రంధ్రాలు వేసి, అధిక పీడనం వద్ద ఆక్సిజన్‌, నీటి ఆవిరిని పంపి భూగర్భంలోనే బొగ్గును మండిస్తారు. అలా మండించగా వచ్చే మిశ్రమ వాయువును ఉపరితలానికి తీస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రయోగ దశలోనే దీనివల్ల కలిగిన తీవ్ర పర్యావరణ నష్టాలను చూసి ఈ సాంకేతికతను ఉపసంహరించుకున్నారు.

తీవ్ర దుష్ప్రభావాలు

భూగర్భ జలాలు విషతుల్యం

బొగ్గును భూమి లోపల మండించినప్పుడు బెంజీన్‌, టోలుయిన్‌, ఫినాల్స్‌, ఆర్సెనిక్‌, భార లోహాల వంటి అత్యంత ప్రమాదకరమైన, క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉత్పన్నమవుతాయి. ఇవి భూగర్భ జలాల్లోకి చేరి నీటిని పూర్తిగా విషతుల్యం చేస్తాయి. ఫలితంగా ఈ నీరు తాగునీటికే కాక, వ్యవసాయానికి కూడా పనికిరాకుండా పోతుంది.

భూమి కుంగుబాటు

వేల హెక్టార్ల విస్తీర్ణంలో భూగర్భంలో ఉన్న బొగ్గు కాలిన తర్వాత అక్కడ భారీ శూన్యత ఏర్పడుతుంది. దీనివల్ల కాలక్రమేణా పైనున్న ఉపరితల భూమి కుంగిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా పంట పొలాలు ధ్వంసమవ్వడమే కాకుండా, పరిసర గ్రామాల భవనాలు, మౌలిక వసతులు బీటలు వారి కూలిపోయే విపత్తు పొంచి ఉంది.

తీవ్రమైన వాయు కాలుష్యం

గ్యాసిఫికేషన్‌ ప్రక్రియలో లీకేజీలు జరిగితే హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, కార్బన్‌ మోనాకై ్సడ్‌ వంటి ప్రాణాంతక వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇది స్థానిక ప్రజల్లో తీవ్ర శ్వాసకోశ, నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది.

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం

చింతలపూడితో పాటు చుట్టుపక్కల ఉన్న టి.నర్సాపురం, లింగపాలెం మండలాల్లో ఆయిల్‌పామ్‌, మామిడి, కొబ్బరి, వరి, మొక్కజొన్న వంటి వాణిజ్య పంటలు విస్తారంగా పండుతాయి. వేల ఎకరాల సారవంతమైన భూములు బీడుగా మారితే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

పర్యావరణ విధ్వంసం

భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌తో పొలాలు బీడు వారే అవకాశం

భూగర్భ జలాలు విషతుల్యం

ఆదాయంపైనే పాలకులకు శ్రద్ధ !

గ్రామాల్లో భగ్గుమంటున్న నిరసనలు

అన్నదాతల ఆందోళనలకు ప్రజా సంఘాల మద్దతు

ఒకవైపు ఈ ప్రాజెక్టు వల్ల తీవ్ర ముప్పు ఉందని ప్రజలు నిరసిస్తుంటే, మరోవైపు సంస్థ మాత్రం చాపకింద నీరులా పనులు పూర్తిచేస్తోంది. లింగపాలెం పరిసరాల్లో పెద్ద ఎత్తున గోడౌన్లను అ ద్దెకు తీసుకోవడం, సామగ్రిని నిల్వ చేయడం, సత్తుపల్లి కేంద్రంగా ప్రతినిధులు పర్యవేక్షించడం వంటి చర్యలు స్థానికులకు మరింత ఆగ్రహం కలిగిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామగ్రామానా కమిటీలుగా ఏర్పడి అధికారులు, సంస్థ ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. ఈ పోరాటానికి వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), వివిధ ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి.

కేవలం రూ.వేల కోట్ల ఆదాయాన్ని మాత్రమే చూస్తూ, భవిష్యత్‌ తరాల మనుగడను తాకట్టు పెట్టేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రవర్తించడం బాధ్యతారాహిత్యమని పర్యావరణవేత్తలు హె చ్చరిస్తున్నారు. ఇది కేవలం భూములు ఇచ్చే రై తుల సమస్య మాత్రమే కాదని, గాలి, నీరు, భూమి కలుషితమై యావత్‌ జిల్లా ప్రజల ఆ రోగ్యం ప్రమాదంలో పడే విపత్తు ఉందని, ప్ర భుత్వం తక్షణమే ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, పర్యావరణ నష్టాలపై స్వతంత్ర నిపుణుల కమిటీతో శ్వేతపత్రం విడుదల చేయాలని అంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, ఈ ప్రాజెక్టు ప్రతిపాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement