డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు
● బెదిరింపులకు భయపడబోం
● మాజీ హోం మంత్రి వనిత ధ్వజం
ద్వారకాతిరుమల: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీరుపై వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి తానేటి వనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం, అసభ్య పదజాలంతో మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ద్వారకాతిరుమల కాపు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులపై ఎమ్మెల్యే మద్దిపాటి ఉపయోగిస్తున్న పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాష అది కాదని, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులతో బెదిరింపులు
వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన ఓ సోషల్ మీడియా కార్యకర్తను పోలీసులు స్టేషన్కు పిలిపించారని వనిత అన్నారు. నాయకులను వెంట తీసుకురావద్దంటూ పిలిచి, బెదిరించి క్షమాపణ చెప్పించారని, ఆ దృశ్యాలను వీడియో తీసి ఎమ్మెల్యేకు పంపించారని చెప్పారు. అనంతరం ఆ వీడియోను ఎమ్మెల్యే అనుకూల సో షల్ మీడియా గ్రూపుల్లో పెట్టారన్నారు. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో ఈ ఘటనతోనే అర్థమవుతోందని ఆమె అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇ లాంటి బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని, ఎవరూ భయపడొద్దని ధైర్యమిచ్చారు.
ప్రలోభాలకు లొంగొద్దు
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభపెట్టే ప్రయ త్నాలు జరుగుతున్నాయని వనిత ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి పోటీకి దిగాలని, ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు.
దట్ ఈజ్ జగన్
జగనన్న పొగాకు రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆగస్టు 5న దేవరపల్లికి వచ్చిన కార్యక్రమం విజయవంతం కావడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారని వనిత అన్నారు. జగన్ పర్యటన తర్వాత పొగాకు ధర కిలో రూ.265 నుంచి రూ.345కు పెరిగిందని ‘దట్ ఈజ్ జగన్’ అని ఆమె అన్నారు.
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలు జరిగాయని వనిత ఆరోపించారు. అర్హతతో ఉద్యోగం పొందిన వారి వీడియోలు తీసి తప్పు జరగలేదని.. చేసిన పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


