ద్వారకాతిరుమల: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజను అట్టహాసంగా చేసుకోవాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. అయితే ఈసారి పండుగకు ధరలే పెద్ద విఘ్నంగా మారాయి. పూజా సామగ్రి కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు వెనుకడుగు వేసే పరిస్థితి నెలకొంది. పండ్లు, పూలు, కొబ్బరికాయలు, పత్రి నుంచి ప్రసాదానికి ఉపయోగించే డ్రైఫ్రూట్స్ వరకు ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం పడింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం మార్కెట్లలో వినాయక చవితి సందడి కనిపించింది. కానీ అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో వ్యాపారాలు అంతంత మాత్రంగానే జరిగాయి.
భగ్గుమన్న ధరలు..
అస్తం (డజన్నర) అరటిపండ్ల ధర రూ. 100కు చేరింది. పావు కిలో చామంతి పూలకు ఏకంగా రూ. 150 వరకు చెల్లించాల్సి వచ్చింది. అలాగే కొబ్బరికాయ ఒక్కటి రూ. 30 నుంచి రూ. 40 పలికింది. కిలో ఆపిల్, దానిమ్మ ధరలు రూ. 150 చొప్పున ఉండగా.. ద్రాక్ష, కిస్మిస్ పండ్లు కిలో రూ. 200, వినాయకుడి పూజలో ఉపయోగించే మొక్కజొన్న పొత్తు ఒక్కటే రూ. 20 లకు చేరింది. అరటి పిలక కూడా రూ. 25 నుంచి రూ. 30 వరకు పలికింది. సామాన్యుడు పూజ చేసుకోవాలంటే.. 2 వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. అదే పురోహితుడి సహాయంతో శాస్త్రోక్తంగా పూజ చేయించుకోవాలంటే ఖర్చు రూ. 3 వేలకు పైమాటే.
ఈసారి బడ్జెట్లోనే పూజ..
ధరలు పెరగడంతో భక్తులు గతంలో మాదిరిగా పెద్ద మొత్తంలో పూజా సామగ్రిని కొనుగోలు చేయలేదు. సంప్రదాయం కోసం అవసరమైన మేరకే పండ్లు, పూలు, పత్రి, కొబ్బరికాయలు తీసుకున్నారు.
పండ్లు, పూలు, పత్రి.. అన్నింటా పెరిగిన ధరలు


