భీమడోలు: కలువ పూలు కోసేందుకు చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన విషాద ఘటన ఆదివారం సాయంత్రం భీమడోలు మండలంలోని అన్నేవారిగూడెంలో చోటు చేసుకుంది. దుద్దేపూడి పంచాయతీ శివారు అన్నేవారిగూడెంకు చెందిన పోతుబోయిన రాఘవులు (37) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పండగ పూట ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన పి. రాఘవులు జీవనోపాధి నిమిత్తం వినాయక ఉత్సవాల సందర్భంగా కలువ పూసి కోసి మార్కెట్లో అమ్ముకుందామని భావించి గ్రామంలోని ఓ చెరువులోకి దిగాడు. అయితే, చెరువు లోతు అంచనా వేయలేకపోవడంతో నీటిలో చిక్కుకుని ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చెరువులో గాలించి బయటకు తీశారు. అప్పటికే ఆయన మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


