నూజివీడు: పట్టణంలోని ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద అనధికారికంగా టీడీపీ నాయకులు నిర్మించిన ఆర్చిపై మంత్రి కొలుసు పార్థసారథి సౌజన్యంతో అనే పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాలనీ వద్ద పోలీసులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ సీఐ ఐవీ నాగేంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతాప్ అప్పారావును అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గురుకుల పాఠశాల వద్ద నిర్మించిన ఆర్చి వద్దకు కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రతాప్ అప్పారావు చేరుకున్నారు. అక్కడి నుంచే ఫోన్లో మున్సిపల్ కమిషనర్ కొరపాటి పీరయ్యతో మాట్లాడి పేరును తీయించాలని చెప్పారు. ఇక్కడకు వచ్చి అనుమతి లేకుండా నిర్మించిన ఆర్చిని పరిశీలించి పేరును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రతాప్ కోరారు. అర గంట సేపు వేచి చూసినా కమిషనర్ రాకపోయే సరికి నాయకులు, కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జా తీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలిసి నూజివీడు పట్టణం, ఎమ్మార్ అప్పారావు కాలనీ, సమీప గ్రామాల నుంచి వైఎస్సార్సీపీ, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో హైవేపై ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. సీఐ ఐవీ నాగేంద్రకుమార్ ఆందోళన విరమించాలని కోరారు. దీనికి ప్రతాప్ అప్పారావు బదులిస్తూ మున్సిపల్ కమిషనర్ వస్తానని అరగంట వేచి చూసినా రాలేదని అందుకే ఆయన వచ్చే వరకూ ఆందోళన చేస్తామని చెప్పారు. అయితే అరెస్టు చేయాల్సి వస్తుందని సీఐ చెప్పడంతో వైఎస్సార్సీపీ నాయకులకు, సీఐకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ప్రతాప్ అప్పారావును అరెస్టు చేసి పోలీసు కారు ఎక్కించారు.
కారుకు అడ్డుగా పార్టీ శ్రేణులు
ప్రతాప్ అప్పారావును కారులో తీసుకెళ్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీకి చెందిన మహిళలు కారుకు అడ్డుగా రోడ్డుపై పడుకుని ముందుకు కదలనివ్వలేదు. ఆర్చిపై కొలుసు పార్థసారథి పేరును తొలగించాలంటూ నినాదాలు చేశారు. క్రెడిట్ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకులు డౌన్డౌన్, ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగ ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యం నశించాలి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావును వెంటనే విడుదల చేయాలని, కాలనీ ఏర్పాటుతోగాని అభివృద్ధితో గాని ఏ సంబంధం లేని వారి పేరు తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. చివరకు పోలీసు కారు ముందు బైఠాయించిన, పడుకున్న వారిని పక్కకు నెట్టేసి కారును ముందుకు తీసుకెళ్లి ప్రతాప్ అప్పారావును పట్టణ పోలీసుస్టేషన్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో పాటు 32 మందిని అరెస్టు చేసి వారందరికీ 41 నోటీసు అందించి పంపించారు.
నేషనల్ హైవేపై ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు ఇ బ్బంది పడుతుండటంతోనే మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును అరెస్టు చేసి పో లీసుస్టేషన్కు తరలించాం. ఆర్చి విషయం ఏ మైనా ఉంటే సంబంధిత అధికారులతో మా ట్లాడుకోవాలే తప్ప రోడ్డెక్కి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదు.
– కేవీవీఎన్వీ ప్రసాద్, డీఎస్పీ
సంబంధం లేని కాలనీ ఆర్చిపై మంత్రి కొలుసు పేరు వేయడంపై అభ్యంతరం
మూడు రోజులుగా చెబుతున్నా స్పందించని అధికారులు
ఆందోళనకు దిగిన ప్రతాప్ అప్పారావు


