పెనుగొండ: కుమారుడు ప్రయోజకుడై కొనుగోలు చేసిన కొత్త ఇంటి గృహప్రవేశానికి ఆనందంగా వెళ్లిన ఆ తండ్రిని మృత్యువు డీసీఎం రూపంలో కబళించింది. ఆచంట మండలం ఆచంట వేమవరానికి చెందిన ఉపాధ్యాయుడు నిల్లా పూర్ణ కళాధర్ (50) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పూర్ణ కళాధర్ పెద్ద కుమారుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఓ అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుగోలు చేశారు. గృహప్రవేశం నిమిత్తం పూర్ణ కళాధర్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్లోని చందానగర్కు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం మిత్రులతో కలిసి జేఎన్టీయూను సందర్శించడానికి వెళుతుండగా, ఓ డీసీఎం వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూర్ణ కళాధర్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆయన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కళాధర్కు ఇద్దరు కుమారులు కాగా, ఇటీవలే పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆచంట మండలం పెనుమంచిలి వర్ధనపు గరువులోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కళాధర్ మృతి పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
ఉంగుటూరు: ఉంగుటూరులో కోతి దాడి చేసిన ఘటనలో గుర్రాన రత్నకుమారి అనే మహిళ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యురాలు డాక్టర్ శ్రావణరెడ్డి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. గ్రామంలో కోతులు దాడలు పెరిగిపోయాయని, చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


