ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ స్పెషల్ టెట్ను ప్రకటించడాన్ని నిరసిస్తూ మంగళవారం నగరంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి మాట్లాడుతూ ఆగస్టులో నిర్వహించిన టెట్లో అందరికీ ఒకే విధానం కాకుండా, కొత్తగా నియామకం పొందే డీఎస్సీ టీచర్ల మాదిరిగానే రిజర్వేషన్ల ప్రకారం అర్హత మార్కులు నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టంలోని క్లాజ్ 23/1ను తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రకటించిన స్పెషల్ టెట్ను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించడంతో పాటు, అర్హత మార్కులను 35 శాతంగా ఖరారు చేయాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి 30 వరకు జిల్లాలోని వివిధ డివిజన్లలో బైక్ జాతాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 3న తలపెట్టిన చలో విజయవాడను విజయవంతం చేసేందుకు వేలాదిగా తరలివెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎస్.సుధారాణి, నంబూరి రాంబాబు, ఈ.శివశంకరరావు, జి. అంజన, బి. మోహనరావు, షేక్ ముస్తఫా అలీ తదితరులు పాల్గొన్నారు.


