జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు అన్నదానం, ప్రసాదాల తయారీని పరిశీలించారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘మన మిత్ర’ డిజిటల్ సేవలు
రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలతో సమానంగా మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కూడా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఇంటి వద్ద నుంచే దర్శనం, సేవా టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): నిమ్మలగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లక్కవరం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. లక్కవరం గ్రామానికి చెందిన ఆరుగొల్లు కళ్యాణ్ (26), అదే గ్రామానికి చెందిన చేపల పండుతో కలిసి ద్విచక్ర వాహనంపై ద్వారకాతిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యలో నిమ్మలగూడెం వద్ద జి.కొత్తపల్లి వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి బైక్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కళ్యాణ్కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది.
108 సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు..
వాహనంలో ఆక్సిజన్ అందించాలని కోరగా, మొదట ఆక్సిజన్ అందుబాటులో లేదని ఈఎమ్టీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) బదులిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత వెతికి అమర్చేసరికి తీవ్ర ఆలస్యం జరిగిందని, అప్పటికే కళ్యాణ్ ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి చేరుకున్నాక పరీక్షించిన వైద్యులు కళ్యాణ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు చేపల పండు పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..
మృతుడు కళ్యాణ్ తన కుటుంబానికి ఏకై క కుమారుడు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న యువకుడు అకస్మాత్తుగా కన్నుమూయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. ఈ ఘటనపై లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దుర్మరణం, మరో యువకుడి పరిస్థితి విషమం


