పరారైన జీవిత ఖైదీ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పరారైన జీవిత ఖైదీ అరెస్ట్‌

Aug 26 2026 12:54 AM | Updated on Aug 26 2026 12:54 AM

నరసాపురం: భార్యను హతమార్చిన కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ.. హైకోర్టు ఆదేశాలతో మధ్యంతర బెయిల్‌ పొంది పరారైన ఖైదీని నరసాపురం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు నరసాపురం డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... 2008 జనవరి 22వ తేదీన నరసాపురానికి చెందిన ఉయ్యూరి వెంకటరమణ తన భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టి క్రూరంగా హత్య చేశాడు. దీనిపై 2022 నవంబర్‌ 15వ తేదీన నరసాపురం 10వ అదనపు జిల్లా కోర్టు వెంకటరమణకు జీవిత ఖైదు విధించడంతో, అతను రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, వెంకటరమణ తాను హెచ్‌ఐవీ రోగినని, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొంటూ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. దీనిని పరిశీలించిన హైకోర్టు 2024 ఏప్రిల్‌ 24వ తేదీన మూడు నెలల బెయిల్‌ మంజూరు చేసి, గడువు ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. అయితే, వెంకటరమణ బెయిల్‌ గడువు ముగిసిన తర్వాత కూడా జైలుకు వెళ్లకుండా పరారయ్యాడు. ఖైదీని పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో నరసాపురం టౌన్‌ సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ ఖైదీ హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో తన రెండో భార్యతో కలిసి ఉంటున్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం హైదరాబాద్‌ వెళ్లి నిఘా పెట్టగా, ఆ విషయం గమనించిన వెంకటరమణ అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌ గ్రామానికి పారిపోయాడు. అక్కడ పోలీసులు అతనిని ఈనెల 22వ తేదీన పట్టుకుని, 24వ తేదీన హైకోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం వెంకటరమణను రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement