ఏలూరు (ఆర్ఆర్పేట): సామాజిక శంఖారావం–కులవివక్ష లేని సమాజం కోసం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన అధ్యయన యాత్రల్లో వెలుగులోకి వచ్చిన దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రామకృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.మహంకాళి రావు మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాలు, 43 గ్రామాలు, 3 పట్టణాలు, 6 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. 30 గ్రామాల్లో శ్మశాన వాటిక సమస్యలు, 35 గ్రామాల్లో ఇళ్ల స్థలాల సమస్యలు, 25 గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో అత్యధికంగా వెలుగులోకి వచ్చిన సమస్య స్మశాన వాటికలేనివి ఉన్నాయన్నారు. దళితవాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వ్యవసాయ కార్మికుల జిల్లా నాయకులు జి.వెంకట్రావు, జి.సత్యనారాయణ, ఎం.జీవరత్నం, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్, సీఐటీయూ జిల్లా నాయకులు పంపన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


