● 24న స్క్రీనింగ్.. 25 నుంచి 27 వరకు శస్త్రచికిత్సలు
● సేవలందించనున్న అమెరికా, భారత్కు చెందిన ఆర్థోపెడిక్ వైద్యులు
ద్వారకాతిరుమల: కీళ్ల సమస్యలతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు అరుదైన అవకాశం లభించింది. అమెరికా, భారత్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులతో ద్వారకాతిరుమల శివారులోని విర్డ్ ఆస్పత్రిలో ఈనెల 24 నుంచి 27 వరకు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆస్పత్రి ట్రస్ట్ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ భాగస్వాముల సహకారంతో ఈ శిబిరం జరగనుంది. అందులో భాగంగా 24న ఆస్పత్రిలో భుజం, మోచేయి, చేయి, తుంటి, మోకాలి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి 25 నుంచి 27 వరకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. అమెరికా నుంచి డాక్టర్ శ్రీనాథ్ కామినేని, భారత్కు చెందిన డాక్టర్ భావ్యచంద్ మన్నె, డాక్టర్ శ్రీనివాస్ కంభంపాటి, డాక్టర్ కార్తీక్ అస్తి, డాక్టర్ సముందీశ్వరి తదితర వైద్య నిపుణులు సేవలు అందిస్తారని చైర్మన్ తెలిపారు. చికిత్స ఖర్చులు భరించలేని వారికి అత్యాధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. వివరాలకు 83744 45108, 79016 95176 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


