చింతలపూడి (జంగారెడ్డిగూడెం): మండలంలోని వేగవరం చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం జీలుగుమిల్లి మండలం పి.రాజవరం గ్రామానికి చెందిన కొండముర్ల దిలీప్ (23) పొగాకు బేళ్లను దింపి ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఉదయం 5:30 గంటల సమయంలో వేగవరం వద్ద మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణికులెవరూ లేకపోవడం, బస్సులోని 46 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన దిలీప్ను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


