ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఏ రైతు అయినా పంటల బీమా పథకం తెలియదని చెబితే సంబంధిత ప్రాంతంలోని వ్యవసాయశాఖాధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం పంటల బీమా పథకంపై వ్యవసాయాధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లాలో 50 వేల హెక్టార్లకు గానూ కేవలం 9 వేల హెక్టార్లలో మాత్రమే పంటల బీమాకు నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాసితుల కాలనీలను పూర్తి చేయాలి
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్ లోపు పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోఒ మంగళవారం పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణపనులపై అధికారులతో జూమ్కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్విభూసేకరణ లో అవకతవకలకు పాల్పడినా, కాలనీల నిర్మాణాల విషయంలో అలసత్వం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన స్వరణ్ రాజ్
జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం కలెక్టర్ కె.వెట్రిసెల్విని ఏపీ ఎస్ఏసీఎస్ ప్రాజెక్టు డైరెక్టరు బి.స్వరణ్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు, నమోదైన కేసులకు చికిత్సలు, సేవలు, కౌన్సిలింగ్, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లాలో ఏలూరు జిజిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి, ఏలూరు ఆశ్రం హాస్పిటల్, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి మూడు ఆసుపత్రులలో నెలకు సుమారు 10 వేలకు పైగా హెచ్ఐవి నిర్ధారణ ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామని, నమోదైన కేసులకు వైద్యసేవలు, చికిత్సలు, కౌన్సిలింగ్ నిర్వహించడంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ సీహెచ్ బేబీకమల, జీజీహెచ్ సూపరింటెండెంట్ జి.శ్యామల పాల్గొన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి


