● జాడ లేని వానలు
● ఎండిపోతున్న నారుమడులు
● అడుగంటిన చెరువులు
లింగపాలెం: జూలై మాసం ముగుస్తున్నా వరుణుడి జాడ లేకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంతంలో వ్యవసాయానికి, తాగునీటికి వర్షపాతమే ప్రధాన ఆధారం. ఏటా ఈ సమయంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగేవి. అయితే ఈ ఏడాది వర్షాభావం వల్ల పనులు లేక కూలీల కుటుంబ పోషణ కష్టంగా మారింది.
కరువు మేఘాలు.. ఎండమావులుగా చెరువులు
జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు దు క్కులు దున్ని, నాట్లు వేసేందుకు వరి నారుమడులు పోశారు. అయితే జూలైలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నెలలో సాధారణంగా 140 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 5 మి.మీ. మాత్రమే నమోదైంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత నెలకొన్నాయి. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. బోరు బావుల్లో నీటిమట్టాలు అడుగంటిపోయాయి. విత్తిన విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తిన నారుమడులు నీరు లేక ఎండిపోతున్నాయి.
పడిపోతున్న తమ్మిలేరు నీటిమట్టం
ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహాలు రాకపోవడం, స్థానికంగా వర్షాలు కురవకపోవడంతో తమ్మిలేరు రిజర్వాయర్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. ఈ రిజర్వాయర్ పరిధిలోని దాదాపు 37,000 ఎకరాల ఆయకట్టు సాగు ఇప్పుడు అంధకారంలో పడింది.
లింగపాలెం మండలంలో దయనీయం
లింగపాలెం మండలంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 6,000 ఎకరాల వరకు వరి సాగవుతంది. కానీ ప్రస్తుతం నీటి కొరత కారణంగా కేవలం 350 ఎకరాల్లో మాత్రమే బోరు బావుల కింద సాగు చేపట్టారు. ఈ పంట కూడా తగినంత నీరందక ఎండిపోయే స్థితికి చేరింది.


