షరతుల మెలిక.. ఆక్వా సబ్సిడీకి పొగ ! | - | Sakshi
Sakshi News home page

షరతుల మెలిక.. ఆక్వా సబ్సిడీకి పొగ !

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

సాక్షి, భీమవరం: జోన్‌తో నిమిత్తం లేకుండా ఆక్వా సాగు అంతటికీ రాయితీ విద్యుత్‌ ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా హామీని గాలికొదిలేసింది. తాజాగా కొత్త కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తామంటూనే పవర్‌ ఫ్యాక్టర్‌ 0.90 నుంచి 0.95 మధ్య ఉండాలంటూ మెలిక పెట్టింది. రూ.1.50 సబ్సిడీ విద్యుత్‌కు ఎగనామం పెట్టే ఎత్తుగడలో భాగమే షరతులంటూ ఆక్వా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో 14,242 కనెక్షన్లకు..

గతంలో జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం 1.24 లక్షల ఎకరాల వరకు ఉండేది. సిండికేట్‌ దోపిడీ కుదేలైన ఆక్వా రంగానికి అడుగడుగునా అండగా ఉంటూ గత జగన్‌ సర్కారు కొత్త ఊపిరిలూదింది. ప్రపంచంలోనే రెండోదిగా ఏపీ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా)ని ఏర్పాటుచేసింది. టీడీపీ హయాంలో ఆక్వాజోన్‌లో దాదాపు 30 వేలలోపు ఎకరాలు మాత్రమే ఉంటే ఈ–ఫిష్‌ సర్వేతో 1.17 లక్షల ఎకరాలకు పెంచారు. సబ్సిడీపై యూనిట్‌ రూ.1.50లతో పాటు ఇతర రాయితీలు అందించారు. మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్‌, ఫీడ్‌ సరఫరా, ఫిష్‌ ఆంధ్రా ద్వారా ఆక్వా రైతులకు అండయ్యారు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కోవిడ్‌ కష్టకాలంలో సైతం సిండికేట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేసి 100 కౌంట్‌ రూ.180 ఎంఎస్‌పీగా నిర్ణయించి అమలుచేశారు. సాగు లాభసాటిగా మారి జిల్లాలో ఆక్వా విస్తీర్ణం గణనీయంగా దాదాపు 1.34 లక్షల ఎకరాలకు పెరిగింది. గత ప్రభుత్వ కృషితో ప్రస్తుతం జిల్లాలో 14,242 విద్యుత్‌ కనెక్షన్లకు నెలకు దాదాపు రూ.23 కోట్ల సబ్సిడీ అందుతోంది.

కూటమి వంచన : జోన్‌, సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులు అందరికి యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తానని, 500 టన్నుల కెపాసిటీ కలిగిన కోల్డ్‌ స్టోరేజీలు కట్టిస్తామని, ఏరియేటర్స్‌పై సబ్సిడీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా వాటిని అమలు చేయకుండా రైతులను వంచించారు. కూటమి పాలనలో సిండికేట్‌ ఇష్టారాజ్యంగా మారింది. దోపిడీని అడ్డుకుని ఆక్వారంగాన్ని ఆదుకోవాలని ఏడాదిన్నర కాలంగా రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లాలో సుమారు 2 వేల కనెక్షన్లకు రాయితీ విద్యుత్‌ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ ఖర్చు మూడింతలై..

గతంలో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌తో కనెక్షన్‌ కోసం రూ.4.50 లక్షలు ఖర్చయితే ప్రస్తుతం రూ.13 లక్షలకు పైనే వ్యయమవుతోందని, కనెక్షన్‌, నిర్వహణ ఖర్చులు, పెరుగుతున్న విద్యుత్‌ బిల్లులతో ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో 169 జీఓ తమపై మరింత భారం మోపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ షరతు ఆక్వా రైతులకు ఇస్తున్న సబ్సిడీ ఎగ్గొట్టే ఎత్తుగడని విమర్శిస్తున్నారు. షరతులు ఎత్తివేయడంతో పాటు పీఎఫ్‌ ప్రాముఖ్యత, కెపాసిటర్లు, ఆటోమేటిక్‌ పీఎఫ్‌ కంట్రోల్‌పై విద్యుత్‌, మత్య్సశాఖ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ, అవసరమైన పరికరాలకు సబ్సిడీ అందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

పవర్‌ ఫ్యాక్టర్‌పై అవగాహనలేమి

తాజాగా రాష్ట్రంలోని 12 వేల కనెక్షన్లకు రాయితీ విద్యుత్‌ను అందిచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పవర్‌ ఫ్యాక్టర్‌ (విద్యుత్‌ వినియోగ నాణ్యత) 0.90 నుంచి 0.95 శాతం మధ్య ఉండాలని షరతు పెట్టింది. ఈమేరకు 169 జీఓను విడుదల చేసింది. సాధారణంగా పవర్‌ ఫ్యాక్టర్‌ (పీఎఫ్‌) ఒక శాతంగా ఉంటే సమర్థవంతంగా వినియోగిస్తున్నట్టు, 0.95 ఉంటే మంచి స్థాయిలో ఉన్నట్టు, 0.90 ఉంటే ఆమోదయోగ్యంగా, అంతకంటే తక్కువగా ఉంటే విద్యుత్‌ వృథా అవుతున్నట్టుగా భావిస్తారు. అయితే ఒక్కో ఆక్వా చెరువు రెండు నుంచి పది ఎకరాలకు పైబడి విస్తరించి ఏరియేటర్లు నడిపేందుకు గట్లు వెంబడి కిలోమీటర్లు పొడవునా విద్యుత్‌ కేబుల్స్‌ ఉంటాయి. వాటికి జాయింట్లు, విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు తదితర కారణాలతో పీఎఫ్‌ చాలా వరకు 0.90 శాతంలోపు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అధిక శాతం మంది రైతులకు పీఎఫ్‌ అంటే ఏమిటి?, ఎలా లెక్కిస్తారు, ఎందుకు తగ్గు తుంది, ఎలా మెరుగుపర్చుకోవాలనే విషయాలపై అవగాహన ఉండదంటున్నారు. గతంలో విద్యుత్‌ బిల్లుల్లో పీఎఫ్‌ విలువలు స్పష్టంగా ఉండేవని, ఇప్పుడు ఆ వివరాలు కూడా కనిపించక రైతులు తమ అర్హత కోల్పోతున్న విషయాన్ని కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

కూటమి ‘షాక్‌’

విద్యుత్‌ సబ్సిడీకి షరతులు

రూ.1.50 విద్యుత్‌కు పవర్‌ ఫ్యాక్టర్‌ మెలిక

విద్యుత్‌ నాణ్యత 0.90 నుంచి 0.95 మధ్య ఉంటేనే రాయితీ

169 జీఓ విడుదల చేసిన ప్రభుత్వం

రాయితీకి ఎగనామం పెట్టేందుకేనని ఆక్వా రైతుల ఆవేదన

జిల్లాలోని 1.34 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు

రాయితీ విద్యుత్‌ కనెక్షన్లు 16,332

Advertisement
 
Advertisement
Advertisement