సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లా పరిషత్ పాలన గాడి తప్పింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో.. ఏఏ అజెండాతో నిర్వహిస్తారో.. వేటిని ఆమోదిస్తారో.. జెడ్పీ చైర్పర్సన్, సీఈఓకు తప్ప ఎవరికీ తెలియని పరిస్ధితి. జెడ్పీటీసీల ప్రతిపాదనలు, ప్రమేయం లేకుండా పనులు ఖరారు చేయడం పశ్చిమగోదావరి జెడ్పీ ప్రత్యేకత. చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏకపక్షపాలన సాగిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జెడ్పీటీసీలు ఫిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని ఏసీబీ, పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వరకు అందరికీ వరుస ఫిర్యాదులు చేయడం జిల్లాలో హాట్టాఫిక్గా మారింది.
అడ్డగోలుగా పనుల కేటాయింపు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్లో ముగియనుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే చందంగా అడ్డగోలుగా పనులు కేటాయింపు, టెండర్లు లేకుండా ఎవరికీ తెలియకుండా నామినేషన్లపై నచ్చిన వారికి పర్సంటేజీలతో పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి పెదపాడు జడ్పీటీసీగా గెలుపొందిన గంటా పద్మశ్రీ గత ప్రభుత్వ హయాంలో జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరారు. అయినప్పటికీ జెడ్పీలో వైఎస్సార్సీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఏకపక్ష పోకడపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. జెడ్పీ సీఈఓ సైతం అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రజలు ఎన్నుకున్న జెడ్పీటీసీల హక్కులు కాలరాస్తున్నారు.
అడుగడుగునా సభ్యులను అవమానిస్తున్న వైనం
అజెండా ఇవ్వకుండా ఇచ్చినట్లు రసీదులపై సంతకాలు
సభ్యులకు తెలియకుండా పనులు ఖరారు, టెండర్లు
జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తీరుపై జెడ్పీటీసీల ఫిర్యాదు


