కై కలూరు: వైఎస్సార్సీపీ పార్టీ 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలోనూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల వద్ద నివాళి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బుధవారం చెప్పారు. గురువారం ఉదయం 9 గంటలకు కై కలూరు సంత మార్కెట్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. నాలుగు మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో నాయకులు తప్పక హాజరు కావాలని కోరారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ మండల కేంద్రాలలో పార్టీ జెండాలు ఎగురవేసి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించాలని డీఎన్నార్ కోరారు.
ఏలూరు(మెట్రో): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక టూటౌన్ హోటల్ ఎన్లో బుధవారం ఆర్బీఐ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ అవగాహన కార్యక్రమంలో అభిషేక్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, మధ్యతరహా, చిన్న పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం ఎంఎస్ఎం యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల స్థాపనకు రుణాలతో పాటు రాయితీలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు బ్యాంకర్లు సహకారం అందిస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో గ్యాస్ సిలెండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా గృహ అవసరాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు వినియోగించే వంట గ్యాస్ సిలెండర్ల కొరత ఏమాత్రం లేదని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహ వినియోగ దారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన సిలిండర్ల పంపిణీలో జాప్యం జరగడం లేదని అన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కామర్స్– 2 పరీక్షలకు మొత్తం 3,113 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 55 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు జనరల్ విద్యార్థులు 2,109 మందికి 2,010 మంది విద్యార్థులు హాజరు కాగా 99 మంది గైర్హాజరయ్యారు. 1,238 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,103 మంది విద్యార్థులు హాజరుకాగా 1235 మంది గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా నిర్వహించిన గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రాల పరీక్షలకు 267 మంది విద్యార్థులు హాజరయ్యారు. గణితం పరీక్షకు 134 మందికి గాను 113 మంది హాజరు కాగా 21 మంది గైర్హాజరయ్యారు. చరిత్ర పరీక్షకు 176 మందికి గాను 152 మంది హాజరుకాగా 24 మంది గైర్హాజరయ్యారు. వ్యాపార గణక శాస్త్రం పరీక్షకు ముగ్గురు విద్యార్థులకు గాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు.
ఏలూరు(మెట్రో): దాళ్వా సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాలు ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గ్రామస్థాయిలో రైతులందరికీ అవగాహన కల్పించాలన్నారు.


