అద్దె బస్సులు ఆపేస్తాం
డిమాండ్లు నెరవేర్చాలి
తరచూ మరమ్మతులే..
సాక్షి, భీమవరం: ఆర్టీసీ అద్దె (హైర్) బస్సుల యజ మానులు పోరుబాట పట్టారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో నెలవారీ మెయింటెనెన్స్ రూ.40 వేల వరకు పెరిగితే.. ఏపీఎస్ఆర్టీసీ కేవలం రూ. 5,200లు మాత్రమే పెంచడంపై అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీసీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర అద్దె బస్సుల యజమానుల సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయాలని నిర్ణయించారు.
ఉమ్మడి జిల్లాలో..
జిల్లాలో భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో వెన్నెల, స్టార్లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు తదితర బస్సులు 295 ఉన్నాయి. ఇవి మొత్తం రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితమంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లకు మాత్రమే ఫ్రీ సర్వీసును పరిమితం చేసింది.
40 శాతం హైర్ బస్సులే..
జిల్లాలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం 197 ఉండగా వీటిలో 73 హైర్ బస్సులు. ఫ్రీ బస్సుతో ఆయా సర్వీసుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సు సిట్టింగ్ కెపాసిటీ 56 కాగా ప్రస్తుతం వంద మందికి పైనే ప్రయాణిస్తున్నట్టు ఓనర్లు చెబుతున్నారు. లీటరుకు 5.6 కి.మీ చొప్పున బస్సు తిరిగే రూటు, వేసే ట్రిప్పులు (టార్గెట్) మేరకు హైర్ బస్సులకు ఆర్టీసీ డీజిల్ పోయిస్తుంది. మైలేజ్ షార్టేజ్తో అదనంగా డీజిల్ వినియోగమైతే ఆ భారాన్ని యజమానులే భరించాలి. మెయింటినెన్స్ కింద కిలోమీటరుకు రూ.12 నుంచి రూ.13ల చొప్పున ఇస్తుంది. ఏలూరు జి ల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డి పోల పరిధిలో 303 బస్సులు ఉండగా ఫ్రీ సర్వీసు అందిస్తున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు 177 ఉన్నాయి.
రూ.40 వేల వరకు భారం
ప్రయాణికుల రద్దీతో టైర్లు అరుగుదల పెరిగిందని, తరచూ టైర్లు పేలిపోవడం, సీట్లు దెబ్బతినడం, కట్టలు విరిగిపోవడం, ఇంజి సంబంధిత సమస్యలతో మెయింటెనెన్స్ పెరిగిపోయిందని ఓనర్లు అంటున్నారు. రోజుకు 10 లీటర్ల వరకు ఆయిల్ షార్టేజీ వస్తుండటంతో ఆ భారం తమపై పడుతోందని చెబుతున్నారు. మెయింటెనెన్స్, ఆయిల్ షార్టేజీ రూ పాల్లో ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అ దనపు భారంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్లో ఫ్రీ బస్సు ప్రస్తావన లే దని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మైలేజీ లీటరుకు 5.6 కి.మీ నుంచి 4.6 కి.మీ తగ్గించాలని, మెయింటినెన్స్ కి.మీ రూ.13 నుంచి రూ.18కు పెంచాలని, అనుమతి మేరకు ప్రయాణికులను అనుమతించేందుకు ఆదేశాలివ్వాలని, రద్దీకి అనుగుణంగా బస్సు ల సంఖ్యను పెంచాలని కొద్దినెలలుగా అద్దె బస్సు ల యజమానులు ఆర్టీసీని కోరుతున్నారు.
12 నుంచి సమ్మెలోకి..
ఆయిల్, మెయింటెనెన్స్ కింద ఒక్కో బస్సుకు నెలకు కేవలం రూ.5,200లు పెంచుతూ ఆర్టీసీ బుధవారం సర్క్యులర్ జారీచేయడాన్ని అద్దె బస్సు ల ఓనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నష్టాల కోర్చి తాము బస్సులు నడపలేమని, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈనెల 12 నుంచి బస్సులు నిలిపివేసి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు.
ఎంఎస్ఎంఈలో లోన్పై బస్సు తీసుకుని ఆర్టీసీలో హైర్కు న డుపుతున్నాను. ఫ్రీ బస్సు రద్దీతో నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భా రం పడుతుంటే కేవలం రూ. 5,200 మాత్రమే ఆర్టీసీ పెంచింది. డిమాండ్లు పరిష్కరించకుంటే 12 నుంచి బస్సులు ఆపేస్తాం.
– రాపాక మహేష్, హైర్ బస్ యజమాని, సిద్దాంతం
బస్సులో 56 మందికు గాను వంద మందికి పైనే ప్రయాణిస్తున్నారు. ఓవర్లోడ్తో తరచూ మరమ్మతులతో మెయింటినెస్స్ పెరిగిపోయింది. నెలనెలా అదనపు భారంతో అద్దె బస్సుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నాం. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మె చేస్తాం.
– ఎ.ప్రియాంక,
హైర్ బస్సు యజమాని, తణుకు
ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు
పోరుబాటలో హైర్ బస్సుల యజమానులు
ఫ్రీబస్సు ఓవర్ లోడ్తో భారీగా పెరిగిన మెయింటెనెన్స్
ఒక్కో బస్సుపై నెలకు రూ.40 వేల వరకు అదనపు భారం
ఆర్టీసీ కేవలం రూ.5,200 పెంపుపై అసంతృప్తి
12 నుంచి బస్సుల నిలిపివేతకు రాష్ట్ర హైర్ బస్ ఓనర్స్ సంఘం పిలుపు
అద్దె బస్సులు ఆపేస్తాం
అద్దె బస్సులు ఆపేస్తాం


