రేషన్ బియ్యం పట్టివేత
పాలకొల్లు (సెంట్రల్) : పాలకొల్లు పట్టణం, చెంబునిపేటలో గురువారం విజిలెన్స్, రెవెన్యూ, పౌర సరఫరా అధికారులతో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 3 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యాన్ను సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందన్నారు. యజమాని కనమర్లపూడి శేషగిరిరావు, డ్రైవర్ పీతాని మోహనకృష్ణలపై నిత్యవసర వస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు.
నూజివీడు: జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు పట్టణంలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థి పీ రేవంత్ ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జోజిబాబు తెలిపారు. జార్ఘండ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ జట్టుకు రేవంత్ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ను ప్రిన్సిపాల్ అభినందించి గురువారం క్రీడా కిట్ను అందజేశారు. రేవంత్ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ శుక్రవారం ఏలూరు రానున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు వై.విశ్వమోహాన్రెడ్డి గురువారం ప్రకటనలో తెలియజేశారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి మీటింగ్ హాల్లో జిల్లాలోని ఎస్సీ సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారన్నారు. ముందుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఏలూరు, రెవెన్యు గెస్ట్హౌస్ నందు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు.
కుక్కునూరు: తల్లిదండ్రులపై కుమార్తె దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి పేర్కొన్నారు. వింజరం గ్రామానికి చెందిన కరేటి చిట్టెమ్మ, కృష్ణయ్య దంపతులు, వారి వ్యవసాయ భూములకు వచ్చిన పోలవరం ముంపు పరిహార డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల నుంచి మోసపూరితంగా కుమార్తె చిమడబోయిన మంగమ్మ, ఆమె కుటుంబసభ్యుల ఖాతాలకు బదిలీ చేసుకుంది. అలాగే వారి గొర్రెలు, మేకలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో ప్రశ్నించిన వృద్ధ దంపతులను అసభ్య పదజాలంతో దూషించి, శారీరకంగా దాడి చేసి, చంపుతామని బెదిరింపులకు గురిచేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు.
చోరీ కేసు నమోదు
పోలవరం రూరల్: తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం మండలం పాతపట్టిసీమ గ్రామానికి చెందిన రాపాక శ్రీను కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాత్రి శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో ఉన్న 10 కాసుల బంగారం, 10 తులాల వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించారు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి గుర్తిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెదపాడు: మానవత సేవాసంస్థ రాష్ట్ర చైర్మన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారుబోయిన కోటేశ్వరరావు తన భార్య సూర్య నాగమణి భౌతికకాయాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. నాగమణి అనారోగ్యంతో బుధవారం మరణించారు. తన మరణంలో కూడా సేవ ఉండాలనే ఆశయంతో తమ మరణాంతరం తమ శరీరాలను మెడికల్ కళాశాలలకు అప్పగించేందుకు ముందస్తుగా అనుమతి పత్రాన్ని అందించారు. దీంతో సూర్యనాగమణి భౌతికకాయాన్ని కోటేశ్వరరావు మెడికల్ కళాశాలకు అప్పగించారు. వివిధ జిల్లాలకు చెందిన మానవత ప్రతినిధులు సూర్య నాగమణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం పట్టివేత


