
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీ పరిధిలో వెంకటరామానుజపురం గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం ఎడమ చేతిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ నాయకులు దీనిని గుర్తించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. వైఎస్సార్ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇర్ల విజయశాంతి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, దోరేపల్లి సుబ్బారావు, మర్రెడ్డి పెద రామాజంనేయులు, డి.సుబ్బారావు, జె.కమలాకరరెడ్డి, కఠారి నారాయణరావు, కఠారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బాస్కెట్బాల్ జట్టు ఎంపిక
ఏలూరు రూరల్: ఆదివారం ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు ఎంపిక పోటీలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలకు నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కలిగిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీను, కోశాధికారి కె.మురళీకృష్ణ వెల్లడించారు. మే 15 నుంచి 18 వరకూ చిత్తూరులో అంతర జిల్లాల అండర్–14 సబ్ జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జట్టు పాల్గొంటుందన్నారు.
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం