
ఆ కలపను ఎవరి కోసం వదిలేశారో..?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం–గుణ్ణంపల్లి మధ్యలోని పోలవరం కుడి కాలువ గట్టుపై ఉన్న భారీ వేప చెట్లను ఒక టీడీపీ నాయకుడు అడ్డగోలుగా నరికివేసిన విషయం తెలిసిందే. అయితే సంబంధిత అధికారులు దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అంతే కాకుండా నరికిన కొంత కలప కాలువ గట్టుపైనే దర్శనమిస్తున్నా అధికారులు ఇప్పటివరకు దాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఇదేంటని అధికారులను కొందరు అడిగితే చిన్న చెట్లే కదా.. నరికిన వారు తీసుకుంటారని వారు సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి భారీ చెట్ల కలపను ఇప్పటికే బయటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. మిగిలిన కలప ఎం.నాగులపల్లి–గుణ్ణంపల్లి మధ్య కాలువ గట్టుపై అక్కడక్కడా గుట్టలుగా ఉన్నాయి. ఈ చెట్ల నరికివేత వెనుక అధికారుల హస్తం ఉన్నట్టు స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని అంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చెట్లు నరికిన సదరు నాయకుడిపై, అతనికి సహకరించిన వారిపై, అలాగే జంగిల్ క్లియరెన్స్ కాంట్రాక్టు తీసుకుని ఇష్టానుసారంగా బయట వ్యక్తులతో చెట్లు నరికించిన కాంట్రాక్టరుపై సైతం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా కలపను స్వాధీనం చేసుకుని, వేలం నిర్వహించగా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని అంటున్నారు. దీనిపై కాలువ ఇరిగేషన్ ఏఈ బాపూజీని వివరణ కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలవరం కుడి కాలువ గట్టుపైనే దర్శనమిస్తున్న కలప
స్వాధీనం చేసుకోని అధికారులు
కలపను అమ్ముకునేందుకు చూస్తున్న పచ్చ నేతలు