సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ

Apr 25 2025 8:18 AM | Updated on Apr 25 2025 8:18 AM

సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ

సినిమాల్లో ఇతర భాషల నటులే ఎక్కువ

సినీ నటుడు రావు రమేష్‌

భీమవరం: తెలుగు సినీ రంగంలో నిర్మాతలు మినహా ఎక్కువ మంది ఇతర భాషల వారే ఉన్నారని సినీ నటుడు రావు రమేష్‌ అన్నారు. గురువారం రాత్రి భీమవరం డీఎన్నార్‌ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్‌ 18వ జాతీయస్థాయి సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి సినీ నటులు నాటక రంగం నుంచి వెళితే నేడు నాటక రంగంతో ఎలాంటి పరిచయం లేకున్నా ఇన్‌స్టా గ్రామ్‌, సోషల్‌ మీడియాలో స్క్రిట్స్‌, రీల్స్‌ వంటివి చూసి నటులను ఎంపిక చేసుకునే రోజులు నడుస్తున్నాయన్నారు. డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ నాటక రంగానికి ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, సినీ పరిశ్రమకు ఇస్తున్న రాయితీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కళారంగాన్ని ప్రత్యేకించి నాటక రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి మాట్లాడుతూ డిజిటల్‌ రంగంలో ప్రజలు మునిగి తేలుతున్న సమయంలో కళాపరిషత్‌లు నాటక రంగాన్ని రక్షించడం గొప్ప విషమని, నాటక రంగాన్ని బతికించాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. చైతన్య భారతి నాటక పరిషత్‌ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్‌ మాట్లాడుతూ నాలుగు రోజులపాటు 10 నాటికలు ప్రదర్శిస్తామన్నారు. ముందుగా సినీ నటుడు రావు రమేష్‌ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు, రచయిత ఎస్‌కే మిశ్రోకు చుక్కన సత్యనారాయణరాజు రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి పి.మణిబాలకు పెనుబోతుల శేషగిరిరావు హార్థిక చైతన్య పురస్కారాలతో సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కళానికేతన్‌ కాట్రపాడు వారి కిడ్నాప్‌, మైత్రి కళానిలయం హైదరాబాద్‌ వారి బ్రహ్మ స్వరూపం నాటికలు ఆకట్టుకున్నాయి. డీఎన్నార్‌ కళాశాల అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు, చిలుకూరి నర్సింహరాజు, మంతెన రామ్‌కుమార్‌ రాజు, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, నడింపల్లి మహేష్‌కుమార్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement