
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
ఉంగుటూరు: గోపినాథపట్నం భక్తాంజనేయస్వామి క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, సౌధినీ కుమారి దంపతులు, కొట్టు సోదరులు మురళీ, తాతాజీ దంపతులు, కుటుంబసభ్యులు ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. వివిధ నదీ జలాలతో విగ్రహాలకు అభిషేకాలు చేశారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కొలుకులూరి ధర్మరాజు, సంపత్కుమార్, మానుకొండ వేంకటేశ్వరరావు, చెన్నా జనార్దనరావు, గోపినాథపట్నం సర్పంచ్ పుత్సకాయల విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. పండితుడు ఆంజనేయ ప్రసాద్కు మాజీ మంత్రి కొట్టు సువర్ణ కంకణం తొడిగి పండిత సత్కారం చేశారు.