ద్వారకా తిరుమల: సకల సౌభాగ్యాలూ ప్రసాదించాలని వేడుకుంటూ.. ద్వారకా తిరుమల చినవెంకన్న సన్నిధిలో మహిళలు వరలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయ అనివేటి మండపంలో దేవస్థానం ఆధ్వర్యాన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. మూడు వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. తొలుత వరలక్ష్మీ అమ్మవారి ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాలు, వేదమంత్ర ఘోష నడుమ ఆలయం నుంచి తూర్పు రాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపం వద్దకు వెండి తొళక్క వాహనంపై తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని వేంచేయించి అర్చకులు, పండితులు విశేష పుష్పాలంకరణ చేశారు. ఆలయ ఈఓ వి.త్రినాథరావు దంపతులు అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించారు. పండితులు సుస్వరంగా వేద మంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా మహిళలతో సామూహికంగా వరలక్ష్మీ వ్రతం జరిపించారు. దేవస్థానం పూజా సామగ్రి సమకూర్చింది. శ్రీవారి దర్శనార్ధం క్షేత్రానికి వచ్చిన మహిళా భక్తులు సైతం ఈ వ్రతాల్లో పాల్గొనడంతో అనివేటి మండపాలు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల సౌకర్యార్థం మండపాల మధ్య మధ్యన 13 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వ్రతాల అనంతరం మహిళా భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనం కల్పించారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది.
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్మీ వ్రతాలు వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆ అమ్మవారిని కొలిచారు. వ్రతాలు ఆచరించిన మహిళలకు లక్మీదేవి రూపులను దేవస్థానం అందజేసింది. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, కమిటీ సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
ఫ ద్వారకా తిరుమలలో ఘనంగా
సామూహిక వ్రతాలు
ఫ పాల్గొన్న 3 వేల మందికి పైగా మహిళలు


