ముగ్గురి అరెస్టు
ఆత్రేయపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వివిధ సేవల టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన ఎర్ర సత్యనారాయణ, లోకం వెంకట సురేష్, విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన కోరాడ త్రినాథ్ సాయిలు వాడపల్లి క్షేత్రంలో వేదాశీర్వచనం, దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఆ టికెట్లను దర్శనానికి వస్తున్న ఇతర భక్తులకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. దీనిపై ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి కొత్తపేట కోర్టుకు తరలించినట్లు ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము తెలిపారు.


