కాజులూరు: కోరంగి కెనాల్లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం వేళంగి శివారు కొత్తపేటకు చెందిన పలువురు యువకులు బుధవారం రాత్రి యానాం వెళ్లి మోటార్ సైకిళ్లపై తిరిగి వస్తున్నారు. వీరిలో మచగిరి రాజు (20) అనే యువకుడు కాజులూరు మండలం జగన్నాథగిరిలో తోట త్రిమూర్తులు వారధి వద్ద కోరంగి కెనాల్లో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గురువారం కాలువలో గాలింపు చేపట్టారు. శీల గ్రామం వద్ద రాజు మృతదేహం లభ్యమైంది. జగన్నాథగిరి వీఆర్ఓ ఈశ్వరరావు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గొల్లపాలెం ఎస్సై ఆర్వీఎన్ మూర్తి తెలిపారు.


