రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స
దేవరపల్లి: మాజీ హోం మంత్రి తానేటి వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు అస్వస్థతకు గురయ్యారు. దేవరపల్లి మండలం యర్నగూడెంలోని ఆయన స్వగృహంలో సోమవారం రాత్రి అస్వస్థతకు గురికాగా, హుటాహుటిన చికిత్స కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బాబాజీరావుకు చికిత్స అందజేస్తున్నారు. బుధవారం ఆసుపత్రిలో తానేటి వనిత, పార్టీ నాయకులు ముచ్చికర్ల రవి, కుసులూరి వెంకట సతీష్ తదితరులు ఆయనను కలసి వివరాలు తెలుసుకున్నారు.
కోనసీమ రైల్వే ప్రాజెక్టును
త్వరితగతిన పూర్తి చేయాలి
అమలాపురం టౌన్: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.


