చికిత్స పొందుతూ యువకుడి మృతి
ముమ్మిడివరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన ఇద్దరు జన సైనికులు వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన అడపా మల్లేష్ బాబి (27) ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సాయంత్రం ముమ్మిడివరం నుంచి నిర్వహిస్తున్న మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొని మహిపాల చెరువు నుంచి సీహెచ్ గున్నేపల్లిలోని మిగిలిన జన సైనికులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. త్రీవంగా గాయపడిన బాబిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ పవన్కల్యాణ్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. కోనసీమలో జరిగిన రెండు ఘటనలూ బాధిత కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అభిమాన హీరో కోసం ఒకరిని చూసి ఒకరు చేస్తున్న వేడుకలు కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి.


