విన్నపాలు వినవలె
● కళా ప్రదర్శనలకు ఆడిటోరియంలు నిర్మించాలని ప్రజా నాట్య మండలి జిల్లా కన్వీనర్ ఎస్.మంగరాజు, సభ్యులు కేదారి నాగు, రొంగల వీర్రాజు డిమాండ్ చేశారు.
● ఈ ఏడాది జూలై 13న రాజమహేంద్రవరంలో నిర్వహించిన సమావేశంలో జానపద కళలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ జానపద కళాకారుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
● కళాకారులకు ఆర్టీసీ వాహనాల్లో ఉచిత ప్రయా ణం, నెలకు రూ.పదివేలు గౌరవ వేతనం.
● కళా నైపుణ్యాల పెంపునకు వర్క్షాపులు నిర్వహించాలి.
● తమను ఆదుకోవాలని రికార్డింగ్ డ్యాన్స్ కళాకారులు, ఉభయ గోదావరి జిల్లాల సినీ హీరోల డూప్ల సంఘం డిమాండ్ చేశారు.
కపిలేశ్వరపురం: జనం గుండె చప్పుడు నుంచి.. వారి భావ వ్యక్తీకరణ నుంచి వచ్చిన పదాలు తరువాతి కాలంలో జానపద కళలుగా రూపాంతరం చెంది నాటి ప్రజా జీవితాలను ఎంతో చైతన్యవంతం చేశాయి. ప్రాంతాలు వేరైనా కళారూపాలు వేరైనా భావం.. లక్ష్యం మాత్రం ప్రజల్లో చైతన్యం.. ఆనందం.. రసజ్ఞతను నింపడమే అన్నట్టు గత కాలంలో ఓ వెలుగు వెలిగాయి. 22న అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవం సందర్భంగా తూర్పు జనావళిని ఉర్రూతలూగించిన కళారూపాలు అనేకం.
ఉమ్మడి జిల్లాలో కళా ప్రస్థానం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 55 వేల మంది జానపద కళాకారులున్నారు. పోలవరం జిల్లాలో థింసా, కొమ్ము నృత్యం తదితర కళలు ప్రఖ్యాతిగాంచినవి. గరగ నృత్యం, డప్పు వాయిద్యం, కోలాటం తదితర ఆధ్యాత్మిక కళలు దాదాపు అన్ని ప్రాంతాల్లో సాగాయి. పెద్దాపురం, కాకినాడలలో తప్పెటగుళ్లు, మాధవపట్నం, కొత్తపేటలలో తోలుబొమ్మలాట, పెద్దాపురం తదితర మెట్ట ప్రాంతాల్లో సాముగారడి, రామచంద్రపురం ప్రాంతంలో బుర్రకథ, కపిలేశ్వరపురం మండలంలో గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్య కళాకారులున్నారు. కాకినాడ, రావులపాలెం, పెద్దాపురం, రాజమహేంద్రవరం, రామవరం తదితర ప్రాంతాల్లో నాటక సమాజాలు, దళిత సామాజిక వర్గీయులు గారడీ నృత్యాలతో కళారాధన చేశారు.
గత మే 24 నుంచి రంపచోడవరంలో ‘ఆదివాసీ రేలా’ ఉత్సవాలు, ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పోలవరం జిల్లాలో గిరిజన నృత్య రూపకాలు అలరించాయి. ఈ నెల 1న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం సందర్భంగా జూలై 31న ఎయిర్పోర్టు ప్రాంగణంలో 13 వేల మంది గిరిజన విద్యార్థులు, మహిళలు చేసిన థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు దక్కింది. ఈ ఏడాది మార్చి 28న ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘అందరూ మంచివారే కానీ’ నాటిక అలరించింది. ఇటీవల రాజమహేంద్రవరం త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో పెరవలి జయభాస్కర్ బృందం ఆధ్వర్యంలో 18 రోజుల పాటు వాద్య విన్యాస సమ్మేళనం వైభవంగా సాగింది. కొత్తపేట మండలం వానపల్లిలో ఈ ఏడాది జూన్ 18న ప్రదర్శించిన రామాంజనేయ యుద్ధం, సత్య హరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు అలరించాయి.
ప్రభుత్వం చిన్నచూపు
జానపద కళాకారులు, ఆయా కళాకారుల సంఘాలను ప్రోత్సహించడం, కళాపోషణలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వారి విన్నపాలను, డిమాండ్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో నర్సీపట్నం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతరలో డప్పు కళాకారుడిపై అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు చేయిచేసుకోవడం వివాదాస్పదమైంది. ఆదివాసీల కోయ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని గంగవరంలో ఈ ఏడాది జూలై 21న కోయ భాష దినోత్సవంలో సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు.
టేకిలో ప్రదర్శిస్తున్న గారడీ నృత్యం
అంగరలో ఎలుగుబంట్ల వేషధారణలో కళాకారులు
జనం ఉన్నంత కాలం..
ఉమ్మడి జిల్లాలో జానపద కళల ఉనికి జనం గుండెల్లోంచి వచ్చింది. అవి జనం ఉన్నంత కాలం ఉంటాయి. ప్రభుత్వాలు వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.
– కట్టా కృష్ణారావు, నాటక పరిషత్ ఔత్సాహికులు, కాకినాడ
ప్రజల్లో చైతన్యం.. జాగృతి ఆ కళల లక్ష్యం
తూర్పున వెలుగొందిన కళలెన్నో
కళాకారులను విస్మరిస్తున్న
కూటమి ప్రభుత్వం
22న అంతర్జాతీయ జానపద
విజ్ఞాన దినోత్సవం


