● మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
● ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి జయంతి వేడుకలు
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం సాగించిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు చిరస్మరణీయుడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దివంగత రామ్మోహనరావు జయంతిని ఆయన మిత్రమండలి ఆధ్వర్యాన స్థానిక కంబాల చెరువు జంక్షన్లో గురువారం నిర్వహించారు. ఆ జనయోధుడి విగ్రహానికి పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ, రామ్మోహనరావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన కుమారులు జక్కంపూడి రాజా, గణేష్లు ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఇద్దరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, తన తండ్రి రామ్మోహనరావు మంత్రిగా ఐదేళ్ల పాటు తన మార్కు గుర్తుండే విధంగా పనులు చేశారని చెప్పారు. కష్టాన్ని, ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగుతున్నామని అన్నారు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తాము.. ప్రజా సమస్యలపై తమ తండ్రి చేసిన ఉద్యమాలు చూస్తూ పెరిగామన్నారు. ఏ కార్యకర్తకై నా కష్టం వస్తే ఎదురెళ్లి నిలబడటం, కార్యకర్త కోసం ఎంతవరకై నా ముందుకెళ్లడం నేర్చుకున్నామన్నారు. తండ్రి బాటలోనే ముందుకు సాగుతామని, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా, రేయింబవళ్లు ఏ అవసరం వచ్చినా తోడుగా నిలబడతామని చెప్పారు.
వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మాట్లాడుతూ, జక్కంపూడి రామ్మోహనరావుతో సుమారు 6 నెలల పాటు రాజకీయ ప్రయాణం చేశానని అన్నారు. తన తండ్రి సుబ్బారావుతో రామ్మోహనరావుకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. కార్యకర్తకు ఏ అన్యాయం జరిగినా అండగా నిలబడే మనస్తత్వం జక్కంపూడిదేనని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, రామ్మోహనరావు పోటాట పటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం మాజీ రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ, కష్టనష్టాల విలువ తమకు తెలుసని, తండ్రి స్ఫూర్తితో ముందుకు సాగుతామని అన్నారు. తమ వెన్నంటి ఉన్న స్నేహితులకు ఆజన్మాంతం రుణపడి ఉంటామన్నారు. ఉండవల్లి, జక్కంపూడిల స్నేహబంధం మరురానిదన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, రామ్మోహనరావు తన జీవితాన్ని పేదల కోసమే అంకితం చేశారన్నారు. ఆయన హయంలో పదేళ్లు ఎమ్మెల్యేగా పని చేశానని, జక్కంపూడి ఆశయ సాధన కోసం నిరంతరం పని చేస్తామని చెప్పారు. రామ్మోహనరావు జయంతి సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు అందజేశారు. తొలుత జక్కంపూడి రాజా, గణేష్ల ఆధ్వర్యాన భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా శ్రీనగేష్, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి కుర్రు రవి, నేతలు రాయపురెడ్డి చిన్నా, రామినీడు మురళి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, గొందేసి శ్రీనివాసులురెడ్డి, బైర్రాజు ప్రసాదరాజు పాల్గొన్నారు.
బుర్రిలంకలో భారీ రక్తదాన శిబిరం
కడియం: జక్కంపూడి రామ్మోహనరావు జయంతి సందర్భంగా కడియం మండలం బుర్రిలంకలో మెగా వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పార్టీ నాయ కులు కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యాన జరిగిన ఈ శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు సుమారు 200 యూనిట్ల రక్తం దానం చేశారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి వైద్య బృందం ఆధ్వర్యాన వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలు చేశారు.


