ఆరుగురు పర్యాటకులను రక్షించిన పోలీసులు, జెన్కో సిబ్బంది
మోతుగూడెం: చింతూరు మండలం పొల్లూరు గ్రామం వద్ద సీలేరు నదిలో చిక్కుకొని యువకుడు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన చెందిన ఏడుగురు యువకులు విహారయాత్ర కోసం మోతుగూడెం పర్యాటక ప్రదేశానికి వచ్చారు. సీలేరు నదిలో వీరు స్నానాలు చేస్తుండగా అకస్మాత్తుగా పొల్లూరు జల విద్యుత్ కేంద్రం నుంచి నీరు రావడంతో వారంతా నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు, మోతుగూడెం పోలీసులు, జెన్కో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆరుగురిని రక్షించగలిగారు. గణపవరానికి చెందిన మహంకాళీ ఉదయ్కిరణ్ (23) అనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. స్థానిక సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అతని కోసం డ్రోన్ సహాయంతో గాలింపు చేపట్టిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. మృతుడు ఉదయ్ కిరణ్ భీమవరం కిడ్నీ సెంటర్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు.


