ఆలమూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ముప్పుతిప్పులు పడుతున్నారు. పెట్టుబడిగా డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గతేడాది అక్టోబర్లో సంభవించిన మోంథా తుపాను పంటలన్నింటినీ ముంచేసింది. వాటికి నష్టపరిహారం అందిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన భరోసా.. ప్రకటనకే పరిమితమైంది. దాదాపు ఆరునెలలు దాటినా పంట నష్టపరిహారం అందకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం చేసే అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకూ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిన్నంటినీ తట్టుకుని ముందు ‘సాగు’తూనే ఉంటారు. అయితే వారందరికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చాలా అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగలా మార్చారు. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టకాలం మొదలైంది.
పరిహారం ఊసే లేదు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది అక్టోబర్ చివరి వారంలో సంభవించిన మొంథా తుపాను బీభత్సంతో అనేక మంది వరి, ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చేసిన పోరాటం, రైతుల ఆందోళనలతో వరి, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.పది వేల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ను పూర్తి చేసుకుని రబీ సీజన్ చివరి దశలో ఉన్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం ఊసే ఎత్తడం లేదు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది.
అపార నష్టం
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసిన 1.69 లక్షల ఎకరాల్లో సుమారు 73 వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లినట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. అందులో సుమారు 54 వేల ఎకరాల్లో వరిచేలు నేలకొరగగా, మరో 21 ఎకరాల్లోని పంట నీట మునగగా, అందులో సుమారు 80 వేల మంది రైతులకు నష్టం వచ్చింది. అలాగే జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన 5.84 వేల ఎకరాల ఉద్యాన పంటలకు గాను 3,941.09 ఎకరాల పంట తీవ్రంగా దెబ్బతింది. వీటిలో అధిక శాతం అరటి, కూరగాయల పంటలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని పలు మండలాల్లో 950 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దీనివల్ల 5,336 మంది ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
పంటల బీమా తొలగింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమాను రద్దు చేసింది. ఆ నిర్ణయం లక్షల మంది రైతులకు శాపంగా మారింది. జిల్లాలో సాగు చేసిన 1.69 లక్షల ఎకరాల్లో కేవలం 43,900 ఎకరాల్లో మాత్రమే మోంథా తుపాను బీమా పరిధిలోకి వచ్చింది. మిగిలిన భూమికి చెందిన రైతులు అటు ఉచిత పంటల బీమా వర్తించక, ఇటు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం అందించకపోవడం వల్ల అన్ని విధాలుగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రుణాలు చేసి వరి, ఉద్యాన రైతులు సాగు చేపట్టి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రైతులు అప్పుల ఊబిలో దిగిపోయారు.
తుపానుకు నేలకొరిగిన అరటితోట (ఫైల్)
మోంథా తుపానుకు ఆలమూరు మండలం పినపళ్లలో దెబ్బతిన్న వరి (ఫైల్)
మోంథా తుపానుకు భారీగా పంట నష్టం
ఆరు నెలలు దాటినా పరిహారం
ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం
అప్పుల ఊబిలో రైతులు
పంటల బీమా రద్దు చేయడంతోనే
ఈ దుస్థితి


