ఓ మహిళ కేకలకు పారిపోయిన దుండగులు
పి.గన్నవరం: స్థానిక శివాలయం రోడ్డులో గురువారం సాయంత్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న రెండో తరగతి విద్యార్థిని మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపహరించేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఓ మహిళ కేకలు వేయడంతో ఆ బాలుడిని వదిలి కిడ్నాపర్లు పారిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక పితానివారిపాలేనికి చెందిన దొమ్మేటి రిత్విక్ మణికంఠ శివాలయం ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తన తండ్రి నాగరాజు రిత్విక్ను పాఠశాల వద్ద దించాడు. సాయంత్రం 3.30 గంటలకు పాఠశాల విడిచిపెట్టిన అనంతరం రిత్విక్ ఒంటరిగా నడుచుకుంటూ పితానివారిపాలెంలోని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఆ బాలుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు ఏడవడంతో.. సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న మహిళ గమనించి కేకలు వేసింది. దీంతో బాలుడిని వదిలి ఆ ఇద్దరు బైక్పై పరారయ్యారు. అనంతరం ఆ మహిళ ఇతర విద్యార్థుల సాయంతో రిత్విక్ను మరొక మార్గంలో ఇంటికి పంపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.


