నిడదవోలు పట్టణానికి చెందిన డాక్టర్ కుంచాల విజయకి చిన్నతనంలోనే బాగా చదువు కోవాలి... నలుగురికి సేవ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉంది. కోట రామకృష్ణారెడ్డి, జాలమ్మ దంపతుల కుమార్తె విజయ. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా ఎంతో పట్టుదలతో బీఎస్సీ చదివారు.
ప్రస్తుతం సమిశ్రగూడెం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె సేవా గుణాన్ని భర్త గ్రహించారు. ఆయన ప్రోత్సాహంతో మనోజ్ఞ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్త జీతంలో నెలకు 20 శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిడదవోలులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి దంపతులు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ట్రస్టు కార్యక్రమాలు ఇద్దరూ నిర్వహిస్తూ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న సేవలకు గుర్తింపుగా రెండు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు, ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సోసైటీ, ఏపీ బెస్ట్ సిటిజన్ అవార్డు, పొట్టి శ్రీరాములు విశిష్ట సేవా శిరోమణి పురస్కారంతో పాటు అమెరికాలో బర్కెలీ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.


