మద్యం మత్తులో పూరింటికి నిప్పు
అనపర్తి: మద్యం మత్తుతో తాను నివాసం ఉంటున్న ఇంటికే ఓ వ్యక్తి నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఊలపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రహరీని ఆనుకుని ఉన్న పూరింట్లో ముత్యాలు అనే సంచార జాతికి చెందిన వ్యక్తి ఒక మహిళతో కలసి ఉంటున్నాడు. ముత్యాలు సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉన్న మహిళతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత మత్తులో తాను ఉంటున్న పాకకు నిప్పు పెట్టుకున్నాడు. మంటలు ఎగసిపడడంతో పక్కనే ఉన్న మరో పాక, సెలూన్ షాపు, రెండు గడ్డి మేట్లకు మంటలు వ్యాపించాయి. పూరింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనపర్తి అగ్నిమాపక అధికారి జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బిక్కవోలు పోలీసులు నిందితుడు ముత్యాలును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కాకినాడకు చెందిన డి.కుమార్ (22), డి.నాగేంద్ర అన్నదమ్ములు. ఇద్దరూ మోటారు మెకానిక్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ తమ బుల్లెట్ మోటార్ సైకిల్పై చేబ్రోలు నుంచి కాకినాడకు 216 జాతీయ రహదారిపై వస్తున్నారు. చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని కల్వర్ట్ వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పడంతో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్లో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయపడిన నాగేంద్రను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో పూరింటికి నిప్పు


