జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక

Dec 27 2025 7:44 AM | Updated on Dec 27 2025 7:44 AM

జాతీయ

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక

దేవరపల్లి: మండల కేంద్రమైన దేవరపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి మహిళా క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కృష్ణా జిల్లా నున్నలో అండర్‌–17 స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు జరిగాయి. ఇందులో స్థానిక భాష్యం స్కూలు విద్యార్థినులు జి.తస్యశ్రీ, టి.యశశ్రీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టులో ఆడి ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ పేరయ్య నాయుడు తెలిపారు.

31న పింఛన్ల పంపిణీ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెలకు సంబంధించిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి పంపిణీ జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు.

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక 1
1/3

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక 2
2/3

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక 3
3/3

జాతీయ మహిళా క్రికెట్‌కు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement