
ఆ చేతులకు.. మనసుంది
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆ చేతులకు మనసుంది.. అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని నిజం చేస్తూ సాటివారి సేవలో తపిస్తోంది. తాము పడిన కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఇలా సేవ చేసే ప్రతి హృదయం మానవత్వం చాటుతోంది. మంగళవారం ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. సేవ చేయాలనే తపనతో జిల్లాలో సుమారు 50 వరకూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పడ్డాయి. వీటికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అలాగే మరో 150 వరకూ సంస్థలతో పాటు వ్యక్తులూ అభాగ్యుల సేవల్లో తరిస్తున్నారు. తమకున్న దాంట్లోనే సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజంలో అభాగ్యులు, అనాథలు, నిరాశ్రయులకు సాయం అందించి సహృదయాన్ని చాటుతున్నారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ మా చేతులకూ మనసుందని నిరూపిస్తున్నారు. అందులో కొన్ని తెలుసుకుందాం రండి..
తపనతో చదువుకుని..
పామర్తి గోపాలరావు మాస్టారుది కృష్ణా జిల్లా గుడివాడ మండలం జమీగొల్లేపల్లి. తండ్రి గీత కార్మికుడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక పోవడంతో పదో తరగతి వరకే చదువుకున్నారు. కానీ బాగా చదువుకోవాలనే తపన ఆయనకు ఉండేది. ఈ నేపథ్యంలో తమ బాల్య మిత్రుడు పొట్లూరి రామబ్రహ్మం అందించిన సాయంతో ఆయన పీజీ వరకూ పూర్తి చేశారు. తరువాత రాజమహేంద్రవంలోని వీరేశలింగం పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరి, తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి 2010లో ఉద్యోగ విరమణ పొందారు. అయితే తనలా చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులకు ఫీజులు కట్టేందుకు ముందుకు ఉండేవారు. తరువాత వాకర్స్ యోగా, లాఫింగ్ క్లబ్ను మిత్రులతో స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రభుత్వ పింఛన్ అందని పేదలకు ప్రతి నెలా 5న రూ.500 చొప్పున అందిస్తున్నారు.
ఎంతో ఆనందంగా ఉంది
నేను సహాయం చేసిన కొంత మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి స్థానం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఏ విధంగా ఈ స్థితికి వచ్చానో గుర్తు పెట్టుకున్నాను. అందుకే ప్రతి నెలా నేను, నా మిత్రు లంతా కలసి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పింఛన్ల రూపంలో రూ.50 వేలకు పైగా సహాయం అందిస్తున్నాం. నగరంలో ఎస్కేవీటీ కళాశాలలో ప్రతి నెలా 5న ఈ సాయం చేస్తున్నాం.
– పామర్తి గోపాలరావు,
విశ్రాంత ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం
ఆఖరి మజిలీ కోసం
జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్.రామచంద్రారెడ్డి మి త్రుడి తల్లి చనిపోయినప్పుడు దూరం నుంచి బంధువులు రావడానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని భద్రపరచడానికి ఇబ్బంది ఎదురైంది. దీనిని చూసి రామచంద్రారెడ్డి చలించిపోయాయి. ఇ లాంటి ఘటనల సమయంలో బాధలో ఉన్నవారికి ఏదై నా చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. 2004లో జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఆయన పనిచేస్తున్న సమయంలో మానవత స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం రోడ్డులో అనేక ప్ర మాదాలు జరిగినప్పుడు సాయం కోసం ఎదురుచూసే క్షతగాత్రులను ఆదుకోవాలనే లక్ష్యంతో అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఏర్పడి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 65 శాంతి రథాలు, 20 అంబులెన్స్లు, 375 ప్రీజర్ బాక్సులు, 20 అంబులెన్స్లు, 15 వాటర్ ట్యాంక్లు ఏర్పాటు చేసింది.
ఆదుకోవాలనే తలంపుతో...
చనిపోయిన వారిని భద్రపరచడానికి మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రీజర్లు, వారిని అంత్యక్రియలకు తీసుకు వెళ్లడానికి శాంతి రథాలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. బాధలో ఉన్నవారికి సాయం చేయాలనే తలంపుతో వీటిని అందుబాటులోకి తెచ్చాం. ఇవే కాకుండా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందించాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 15 శాంతి రథాలు, ప్రీజర్లను ఉంచాం.
– కండెపు వెంకట సూర్యనారాయణ,
మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి గోదావరి జిల్లా
సమాజ శ్రేయస్సుకు
పాటుపడుతున్న సంస్థలు
అభాగ్యుల కష్టాలు దూరం
చేసేందుకు ప్రయత్నం
నేడు ప్రపంచ మానవతా దినోత్సవం

ఆ చేతులకు.. మనసుంది

ఆ చేతులకు.. మనసుంది