
దళారులు చెప్పిందే.. మినుముం రేటు
ఫ మినుము రైతుల గగ్గోలు
ఫ క్వింటాల్కు మద్దతు ధర రూ.7,200
ఫ దళారులు ఇస్తున్నది రూ.6,500
ఫ రాబడి పెట్టుబడికే సరిపోతోందని రైతన్నల వేదన
పెరవలి: దిగుబడి ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు ధర లేక మినుము రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా జిరాయితీ భూముల్లో 400 ఎకరాలు, లంక భూముల్లో 2 వేల ఎకరాల్లో మినప సాగు జరుగుతోంది. దాళ్వా వరి కోతలు పూర్తయిన తరువాత మరో 2 వేల ఎకరాల్లో రైతులు మినప సాగు చేస్తున్నారు. ఇందులో వెయ్యి ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు జరుగుతోంది. పెరవలి మండలంలో 200 ఎకరాల్లో మినప సాగు జరుగుతోంది. కానూరు అగ్రహారం, కానూరు, నడుపల్లి, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, కాకరపర్రు, అజ్జరం, అన్నవరప్పాడు, ఖండవల్లి, కాపవరం గ్రామాల్లో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో మినప సాగుకు సుమారు రూ.30 వేల మేర పెట్టుబడి అవుతుంది. ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.
రైతుకు సిండికాటు
క్వింటాల్ మినుములకు ప్రభుత్వం రూ.7,200 మద్దతు ధర ప్రకటించింది. అయితే, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో షరా మామూలుగానే దళారులు సిండికేటుగా మారి, రైతులను దోచుకుంటున్నారు. మినుములు నెమ్ముగా ఉన్నాయని, బెడ్డలు, రాళ్లు ఉన్నాయని, నాణ్యత లేదని పేర్కొంటూ ధర తగ్గించేస్తున్నారు. క్వింటాల్కు రూ.6,500 నుంచి రూ.6,800 మాత్రమే రైతుకు చెల్లిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ మద్దతు ధర కంటే రైతులు క్వింటాల్కు రూ.700 నుంచి రూ.900 వరకూ నష్టపోతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం రైతులకు 4 క్వింటాళ్లకు రూ.28,800, 5 క్వింటాళ్లకు రూ.36,000 వరకూ రావాల్సి ఉంది. కానీ, దళారులు ధర తగ్గించేయడంతో 4 క్వింటాళ్లకు రూ.26,000, 5 క్వింటాళ్లకు రూ.32,500 మాత్రమే వస్తోంది. ఫలితంగా, మినప సాగులో పెద్దగా మిగులు ఉండటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మినుములకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, తమ నుంచి నేరుగా కొనుగోలు చేసేదని, కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నట్లుందని రైతులు విమర్శిస్తున్నారు.
మార్కెట్టులో ధరలు
గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్లో క్వింటాల్ మినుముల ధర రూ.9,800 పలికింది. దీనిని చూసి రైతులు ఈసారి ఎక్కువ మొత్తంలో మినప సాగు చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లోలో క్వింటాల్ మినుముల ధర రూ.8 వేల నుంచి రూ.8,500 వరకూ ఉన్నా రైతుకు మాత్రం రూ.6,500 మా త్రమే చెల్లిస్తున్నారు. కౌలు, పురుగు మందుల వంటి వాటికి పెట్టిన పెట్టుబడికి వస్తున్న రాబడి సరిపోతోందని, లాభా లు లేకపోగా చేతిచమురు వదిలిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నష్టాలపాలయ్యాం
సాగు చేసే సమయంలో మినుములకు మార్కెట్లో మంచి ధరలున్నాయి. తీరా పంట చేతికి వచ్చేటప్పటికి ధరలు పడిపోయాయి. దీంతో నష్టాలు పాలయ్యాము.
– మొఘలపు సత్యనారాయణ,
రైతు, తీపర్రు
అధికారుల
పర్యవేక్షణేదీ!
లంకలో ఎకరం చేనులో మిను ము పంట వేశాను. ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది, పెట్టుబడి రూ.30 వేలు అయ్యింది, వచ్చిన సొమ్ము పెట్టుబడికి సరిపోయింది. మిగులు లేదు. దళారులు క్వింటాల్ రూ.6,500కు కొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎవ్వరూ ఇవ్వడం లేదు. దీనిపై అధికారుల పర్యవేక్షణ లేదు.
– దిడ్ల సంపతిరావు, రైతు, ఖండవల్లి

దళారులు చెప్పిందే.. మినుముం రేటు

దళారులు చెప్పిందే.. మినుముం రేటు

దళారులు చెప్పిందే.. మినుముం రేటు

దళారులు చెప్పిందే.. మినుముం రేటు