
మండల సమావేశాలు అభినందనీయం
జిల్లా అధ్యక్షుడు వేణుకు
మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో ప్రతి వారం ఒక్కో మండలంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ, పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం అభినందనీయమని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని నివాసంలో జగన్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు అధినేతతో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ఎంతో సహకారం అందిస్తున్నారని, పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసి, సమన్వయం చేసే అంశాలపై చర్చించామని వేణు వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, తన వంతు బాధ్యతగా క్రమం తప్పకుండా ప్రతి వారం, వారానికో నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తద్వారా కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పెంపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని రోల్ మోడల్గా తీసుకుని రాష్టంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారని వేణు చెప్పారు.
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులను నియమించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ముగ్గురిని నియమిస్తూ పార్టీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచీ పీఏసీ, సీజీసీ సభ్యురాలిగా పదవులు నిర్వహించిన జక్కంపూడి విజయలక్ష్మిని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలిగా నియమించారు. కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడిగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం తంగేడు గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ దాట్ల వెంకట సూర్యనారాయణరాజును నియమితులయ్యారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గానికి విశాఖపట్నానికి చెందిన తిప్పల గురుమూర్తిరెడ్డిని నియమించారు. అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన పార్టీ నాయకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమితులయ్యారు. పార్లమెంటరీ పరిశీలకులు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలకు అనుసంధానంగా పని చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మండల సమావేశాలు అభినందనీయం