
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్
● 9 మంది ఉపాధి కూలీలకు గాయాలు
● మెరుగైన వైద్యం కోసం నలుగురిని
రాజమహేంద్రవరానికి తరలింపు
కొత్తపేట: ఉపాధి పనికి వెళుతున్న మహిళా కూలీల ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏపీఓ ఎన్.ఆనంద్ తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని అవిడి చప్పిడివారిపాలేనికి చెందిన 9 మంది మహిళా కూలీలు ఆ పంచాయతీ పరిధిలోని గోరింకల డ్రైన్ అభివృద్ధి పనికి శనివారం ఉదయం ఆటోలో బయలుదేరారు. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఆ ఆటోను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న కుడుపూడి నాగమణి, గుబ్బల నాగలక్ష్మి, చప్పిడి గౌరీలక్ష్మి, పితాని సత్యవతి, మట్టపర్తి నాగలక్ష్మి, ఇళ్ల వెంకటలక్ష్మి, గుబ్బల లక్ష్మి, జక్కంశెట్టి పెంటమ్మ, చోడి గన్నెమ్మ గాయపడ్డారు. వారిని స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని ఏపీఓ ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించగా డ్వామా ఏపీడీ మల్లికార్జునరావు హుటాహుటిన కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుడుపూడి నాగమణి, గుబ్బల నాగలక్ష్మి, చప్పిడి గౌరీలక్ష్మి, పితాని సత్యవతికి తీవ్ర గాయాలు కాగా ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ పి. శ్రీకర్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి నలుగురు క్షతగాత్రులను పరామర్శించారు.

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్

ఆటోను ఢీకొన్న ట్రాక్టర్